హైదరాబాద్ హాస్టల్లో నర్సు మృతి... బెడ్పై విగత జీవిగా... ఏం జరిగింది..?
హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఓ నర్సు హాస్టల్ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె బెడ్ పక్కనే ఓ ఇంజెక్షన్ లభ్యమవడంతో... పాయిజన్ ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. వ్యక్తిగత కారణాల వల్లే ఆత్మహత్యకు పాల్పడిందా... లేక మరేదైనా జరిగిందా అన్నది తేలాల్సి ఉంది.
అసలేం జరిగింది...
ఎస్ఐ ఉమా మహేశ్వరి తెలిపిన వివరాల ప్రకారం... మంగళవారం(అగస్టు 11) సాయంత్రం ఓ ప్రైవేట్ హాస్టల్లో ఓ నర్సు(25) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. డిన్నర్కు వెళ్దామని రూమ్ మేట్ ఒకరు ఆమెను పిలిచేందుకు వెళ్లగా... అప్పటికే ఆమె విగతజీవిగా పడి ఉండటాన్ని గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన అక్కడికి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
పాయిజన్ ఇంజెక్షన్...
సూసైడ్ నోట్ ఏదీ లభించనప్పటికీ...ఆమె బెడ్ పక్కన దొరికిన పాయిజన్ ఇంజెక్షన్ ఆత్మహత్య అన్న అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఆమె నర్సు అయినందువల్ల... తనకు తానే ఇంజెక్షన్ చేసుకుని ఉంటుందని ఎస్ఐ అనుమానం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లాకు చెందిన ఆ యువతి యశోద ఆస్పత్రిలో గత నాలుగేళ్లుగా నర్సుగా పనిచేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఆస్పత్రి యాజమాన్యమే ఆమెకు హాస్టల్ సౌకర్యం అందిస్తున్నట్లు చెప్పారు.
ఆ సమయంలో ఎవరూ లేరు...
డే షిఫ్ట్ విధులు ముగించుకుని మంగళవారం మధ్యాహ్నం 2గంటలకు ఆమె హాస్టల్కు చేరుకుందన్నారు. హాస్టల్ డార్మిటరీలో ఆమెతో పాటు మరో తొమ్మిది మంది ఉంటున్నట్లు చెప్పారు. వాళ్లు కూడా నర్సులేనని... ఎవరి డ్యూటీ టైమింగ్స్ వారికి ఉన్నాయని చెప్పారు. ఆరోజు ఆమె హాస్టల్కి చేరుకున్న సమయానికి డార్మిటరీలో ఎవరూ లేకపోవడంతో... అక్కడ ఏం జరిగిందో ఎవరికీ తెలియదన్నారు. బెడ్పై ఆమె అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లు మొదట రూమ్ మేట్ ఒకరు గుర్తించారన్నారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారన్నారు.
Recommended Video
వ్యక్తిగత కారణాల వల్లేనా..?
గత నాలుగేళ్లుగా తల్లిదండ్రులకు దూరంగా హాస్టల్లోనే ఉంటుండటంతో... ఆమె మృతికి సంబంధించి తల్లిదండ్రులు కూడా ఏమీ చెప్పలేకపోతున్నారని ఎస్ఐ పేర్కొన్నారు. అయితే ఓ ఆస్పత్రి ప్రతినిధి మాట్లాడుతూ... వ్యక్తిగత కారణాల వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్పడం గమనార్హం. పోస్టుమార్టమ్ అనంతరం ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.