రియల్ ఎస్టేట్, పెళ్లిళ్లు, ఉద్యోగాలు.. మాటలే పెట్టుబడిగా కోటిన్నర మాయం
హైదరాబాద్ : మాటలే ఆ నేరగాడి పెట్టుబడి. నమ్మితే చాలు నట్టేట ముంచుతాడు. ఆ ప్రబుద్ధుడి మాటలు నమ్మి కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు బాధితులు. హైదరాబాద్ కు చెందిన సదరు నేరగాడు ఢిల్లీ, పుణె, ముంబయి, భోపాల్ తదితర ప్రాంతాలకు చెందిన వారిని బురిడీ కొట్టించాడు. లక్షలాది రూపాయలు కొల్లగొట్టాడు.
రియల్ ఎస్టేట్ వెంచర్లు చేస్తున్నామంటూ కొందరిని బురిడీ కొట్టించాడు. పెళ్లి సంబంధాలంటూ మరికొందరిని, ఉద్యోగాల పేరిట ఇంకొందరిని మోసగించాడు. అలా రెండేళ్లలో దాదాపు కోటిన్నరకు ఎసరు పెట్టాడు.
ముచ్చట చెప్పాడు.. ముంచేశాడు
హైదరాబాద్లో 50 కోట్ల రూపాయల విలువైన వెంచర్లు మూడు ప్రారంభిస్తున్నామని పత్రికల్లో ప్రకటనలు గుప్పించాడు. 2 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే వాటా ఇస్తామంటూ హామీ ఇచ్చాడు. దాంతో పుణెకు చెందిన రియల్టర్ ఖాద్రీ పాటిల్ సదరు మోసగాడిని సంప్రదించారు. 5 కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెడితే వచ్చిన లాభాల్లో 15 శాతం ఇస్తామంటూ బురిడీ కొట్టించాడు.
ఆయన నుంచి 3 దఫాలుగా 76 లక్షల రూపాయలు కాజేశాడు. ఈ మొత్తాన్ని బ్యాంకు ఖాతాలో వేయించుకున్నాడు. అయితే మరో 2 కోట్ల రూపాయల నగదు తీసుకుని హైదరాబాద్ వస్తున్నానంటూ 2017 సెప్టెంబరులో సదరు మోసగాడికి కాల్ చేశారు ఖాద్రీ పాటిల్. తీరా హైదరాబాద్ వచ్చాక కాల్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చింది. ఆ మోసగాడు చెప్పిన ప్రాజెక్టు దగ్గరకు వెళ్లి వాకబు చేయగా.. మోసగాడికి ఆ ప్రాజెక్టుతో ఎలాంటి సంబంధం లేదని తేలింది.
నేను సెట్ చేస్తాగా..! వైద్యురాలికి గాలం
పెళ్లి సంబంధాల పేరిట భోపాల్ లోని ఓ వైద్యురాలికి కుచ్చుటోపి పెట్టాడు. జీవన్సాథీ డాట్కాంలో సదరు డాక్టర్ వివరాలు తెలుసుకుని ముగ్గులోకి దింపాడు. హైదరాబాద్ లోని ఓ ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యుడికి వధువు కావాలని చెప్పుకొచ్చాడు. సంబంధం సెట్ చేస్తానంటూ దఫాదఫాలుగా 3 లక్షల 44 వేల రూపాయలు బదిలీ చేయించుకున్నాడు. 2018 మార్చిలో వరుడిని చూసేందుకు హైదరాబాద్ వస్తున్నామని ఆ వైద్యురాలు చెప్పడంతో మోహం చాటేశాడు. ఇలాగే ఢిల్లీకి చెందిన యువతి దగ్గర 4 లక్షల రూపాయలు, మరో యువతి నుంచి 6 లక్షల రూపాయలు వసూలు చేసి మోసగించాడు.
మాదాపూర్లో ఇంటి ఓనర్ దారుణం ...ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం
సొమ్మిస్తే.. ఉద్యోగాలిప్పిస్తా..!
చెప్పేవాడికి వినేవాడు లోకువ అన్న చందంగా ఈ మోసగాడు ఎంత చెప్పితే అంత నమ్మారు బాధితులు. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురు యువకుల్ని సైతం మోసగించాడు. లండన్లో ఉద్యోగమంటూ ముంబయికి చెందిన చందన్ ను, ఢిల్లీకి చెందిన సీతారాంను మోసం చేశాడు. వారిద్దరి నుంచి దాదాపు 15 లక్షల రూపాయలు కాజేశాడు. ఇలా ఉద్యోగాల పేరిట మరికొందరిని మోసగించాడు ఈ నేరగాడు.
రెండేళ్లుగా నమ్మిస్తూనే ఉన్నాడు
రెండేళ్ల వ్యవధిలో బాధితులకు అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డాడు. 2 సంవత్సరాలు బాధితులను బాగానే మేనేజ్ చేశాడు. అయితే సదరు మోసగాడు చెప్పేదొకటి చేసేదొకటి కావడంతో క్రమక్రమంగా వారికి అనుమానం వచ్చింది. తీరా ఆయా ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లకు వెళ్లి బాధితులు ఫిర్యాదులు చేయడంతో.. తమ పరిధిలోకి రాదంటూ హైదరాబాద్ వెళ్లి ఫిర్యాదు చేయాలని అక్కడి పోలీసులు సూచించారు. ఆ క్రమంలో సైబరాబాద్ పోలీసులకు బాధితులు కంప్లైంట్ చేశారు. అయితే సదరు మోసగాడు చాలా తెలివిగా వ్యవహరించాడని.. బినామీ ఖాతాల ద్వారా బాధితుల సొమ్ము కాజేశాడని అంటున్నారు ఇక్కడి పోలీసులు. ఫిర్యాదులు తీసుకుని నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.