పానీపూరి తినిపిస్తానంటూ.. పబ్లిక్ పార్కు బాత్రూంలోకి తీసుకెళ్లి.. 8ఏళ్ల పాపపై అఘాయిత్యం
విశ్వనగరం హైదరాబాద్ లో మరో అఘాయిత్యం జరిగింది. పట్టపగలే ఓ చిన్నారిపై కామాంధుడు పబ్లిక్ పార్కులో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. గుడిసెలో నివసించే పాపకు పానీపూరీ కొనిపిస్తానంటూ వెంట తీసుకెళ్లి నిందితుడీ దురాగతానికి ఒడిగట్టాడు. సంజీవ రెడ్డి నగర్ (ఎస్ఆర్ నగర్) పోలీస్ స్టేషన్ పరిధిలోని బీకేగూడలో చోటుచేసుకున్న ఈ సంఘటనపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఎస్ నగర్ పోలీసులు చెప్పిన వివరాలిలా ఉన్నాయి..
కూతురి కోసం గాలిస్తూ వెళ్లిన తల్లి.. బీకే గూడలోని పబ్లిక్ పార్కు సెక్యూరిటీగార్డును విచారించింది. చాలా సేపటి క్రితమే ఓ వ్యక్తి... బాలికను, మరో బాలుడిని వెంటబెట్టుకుని పార్కులోని బాత్రూంలో కనిపించాడని, అక్కణ్నుంచి వాళ్లను బయటకు పంపించానని వాచ్ మెన్ చెప్పాడు. ఆ మాటలు విని తల్లి గుండెపగిలినంతపనైంది. అలా ఏడుస్తూనే కూతురి కోసం అటు ఇటూ తిరిగింది. చివరికి..
ఎర్రగడ్డ ఈఎస్ఐ ఆస్పత్రికి సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో.. మద్యం తాగుతోన్న నాగరాజు(30), ఆ పక్కన తన కూతురు, మరో బాలుడు ఆమెకు కనిపించారు. పరుగున వెళ్లి పిల్లల్ని అక్కణ్నుంచి తీసుకొచ్చింది. ఏం జరిగిందని విచారించంగా.. ఆ అంకుల్ పానీపూరి, సమోసా ఇప్పిస్తానని పార్కులోని బాత్రూంలోకి తీసుకెళ్లి లైంగికదాడి చేశాడని పాప చెప్పింది.
Recommended Video
తల్లి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుడు నాగరాజు(30)ను అరెస్టుచేశారు. నిందితుడు కూడా చెత్త ఏరుకుని జీవించే వ్యక్తేనని, బాధిత బాలిక ఇంటికి కొద్ది దూరంలో ఉంటాడని పోలీసులు చెప్పారు. నిందితుడిపై ఐపీసీ 376(ఎ)(బీ), సెక్షన్తో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదుచేశామన్నారు. పట్టపగలే బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపించాలని బాలల హక్కుల సంఘం బాధ్యుడు అచ్యుతరావు, మరికొందరు నేతలు డిమాండ్ చేస్తున్నారు.