లాక్డౌన్: మందుబాబులకు గుడ్న్యూస్.. అంటూ అతిగా ఫేకిన సన్నీ.. ఎలా దొరికిపోయాడంటే..
ప్రధాన ఆదాయ వనరుల్లో ఒకటి కావడంతో మద్యం అమ్మకాలను ప్రభుత్వాలు ప్రోత్సహిస్తూ వచ్చాయి. కానీ కరోనా విలయం కారణంగా సడెన్ గా లాక్ డౌన్ ప్రకటించడంతో గల్లీలో కల్లు దుకాణాల నుంచి స్టార్ హోటల్లోబార్ల దాకా అన్నీ మూతపడ్డాయి. బ్లాక్ దందాపైనా పోలీసులు ఉక్కుపాదం మోపడంతో మద్యం ప్రియులు మిన్నకుండిపోయినా.. తాగుబోతులు మాత్రం అల్లాడిపోతున్నారు. మద్యానికి బానిసైన కొందరైతే పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తూ.. ఆత్మహత్యలకూ పాల్పడుతున్నారు. సరిగ్గా అదేసమయంలో 'మందుబాబులకు గుడ్ న్యూస్' అంటూ ఓ జీవో సోషల్ మీడియాలో వైరలైంది.
సర్కారులో కలకలం..
మార్చి 29 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మద్యం అమ్మకాలు షురూ అవుతాయని, ఆ మేరకు వైన్స్, రెస్టారెంట్ల ఓనర్లు ఏర్పాట్లు చేసుకోండంటూ తెలంగాణ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ డైరెక్టర్ పేరుతో వైరలైన జీవోను నకిలీదిగా పోలీసులు తేల్చారు. కానీ అప్పటికే దాన్ని నమ్మి.. వందల మంది తాగుబోతులు.. ఆయా ప్రాంతాల్లో మద్యం దుకాణాల ముందు క్యూలు కట్టడం కలకలం రేపింది. దీంతో ఎక్సైజ్ అధికారులు మీడియా ముందుకొచ్చి.. లాక్ డౌన్ కొనసాగినంతకాలం రాష్ట్రంలో మద్యం షాపులు తెరవబోమని స్పష్టం చేశారు. ప్రగతిభవన్ లో మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కూడా ఇదే విషయాన్ని గుర్తుచేశారు. అసలీ రాద్ధాంతానికి కారణమైన జీవో సృష్టించిన వ్యక్తిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు.
సీపీ వార్నింగ్..
తెలంగాణ ఎక్సైజ్ శాఖ పేరుతో నకిలీ జీవో తయారుచయడమే కాకుండా, దాన్ని వైరల్ చేసిన వ్యక్తి పేరు సన్నీ అని, ఉప్పల్ కు చెందిన ఆ యువకుణ్ని మంగళవారం మధ్యాహ్నం అరెస్టు చేశామని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ చెప్పారు. సదరు ఫేక్ జీవోపై ఎక్సైజ్ శాఖ ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ విభాగం ఇన్వెస్టిగేషన్ చేసిందని, చివరికి ఐపీ అడ్రెస్ ను కనిపెట్టి, బాధ్యుడైన సన్నీని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తిపైగానీ, లాక్ డౌన్ రూల్స్ పైగానీ ఫేక్ న్యూన్ క్రియేట్ చేసేవాళ్లకు, ముందు వెనకా చూడకుండా వాటిని షేర్ చేసేవాళ్లకు శిక్షలు తప్పవని సీపీ హెచ్చరించారు. ఇప్పటిదాకా 11 మంది ఫేక్ రాయుళ్లను అరెస్టు చేసినట్లు గుర్తుచేశారు.
దేశవ్యాప్తంగా ఇదే సీన్..
మద్యం అమ్మకాలు సడెన్ గా ఆగిపోవడంతో మందుబాబులకు మెంటలెక్కిన ఉదంతాలు దేశమంతటా చోటుచేసుకున్నాయి. వ్యక్తుల్లో పిచ్చి ప్రవర్తన పెరిగిపోవడంతో కేరళ ప్రభుత్వం రిస్క్ చేసిమరీ మద్యం దుకాణాల్ని తెరవాలని నిర్ణయించింది. కానీ కోర్టులు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్(IMA) కేరళ నిర్ణయాన్ని తప్పుపట్టాయి. ఉత్తరాదిలోనైతే ఏకంగా మద్యం షాపులకు కన్నం వేసిన ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. లాక్ డౌన్ నుంచి మద్యం, సిగరెట్ దుకాణాలుకు మినహాయింపు ఇవ్వాలని ప్రముఖ నటుడు రిషీ కపూర్, మరికొందరు సెలబ్రిటీలు డిమాండ్ చేశారు.