రుణాలిప్పిస్తామంటూ మోసం, 100 కోట్లకు శఠగోపం
హైదరాబాద్ : సైబర్ మోసాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ప్రజల అమాయకత్వం, అవసరాలను ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. కోట్ల రూపాయలు కొల్లగొడుతూ జనాన్ని నిలువునా ముంచుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి హైదరాబాద్ లో వెలుగులోకి వచ్చింది. నకిలీ కాల్ సెంటర్లు ఏర్పాటు చేసిన ఇద్దరు సైబర్ మోసగాళ్లు రుణాలు ఇప్పిస్తామంటూ జనానికి శఠగోపం పెట్టారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కోట్ల రూపాయలు కొల్లగొట్టిన ప్రబుద్ధులను అదుపులోకి తీసుకున్నారు. జనం నమ్మకాన్ని ఆసరా చేసుకుని మోసానికి పాల్పడ్డ నిందితులు ప్రస్తుతం కటకటాలు లెక్కపెడుతున్నారు.
ఆకతాయిలారా బహుపరాక్! వందే భారత్ రక్షణకు స్పెషల్ టీమ్స్
రుణాల పేరుతో 100 కోట్ల మోసం
వ్యక్తిగత, వాహన రుణాల కోసం ప్రయత్నిస్తున్న వారినే లక్ష్యంగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు మోసాలకు తెరతీశారు. ఇందుకోసం హైదరాబాద్ ను అడ్డాగా మార్చుకున్నారు. పంజాగుట్ట నాగార్జున సర్కిల్ లోని ఓ అపార్ట్ మెంట్ లో రెండు ఫ్లాట్లు కిరాయికి తీసుకున్న కేటుగాళ్లు నకిలీ కాల్ సెంటర్లు ఏర్పాటుచేశారు. రూ.10 వేల చొప్పున జీతం ఇస్తామంటూ 65 మంది యువతీ, యువకులను టెలీకాలర్లుగా నియమించుకున్నారు. వివిధ నెట్వర్క్ల పరిధిలోని దాదాపు లక్ష ఫోన్ నెంబర్లను గంపగుత్తగా కొనుగోలు చేసిన మోసగాళ్లు, టెలీకాలర్ల ద్వారా రోజూ వందమందితో మాట్లాడించేవారు. రుణం తీసుకునేందుకు అంగీకరించిన వారి వివరాలను ఉద్యోగులు నిందితులకు ఇచ్చేవారు. ఆ తర్వాత నిందితులు స్వయంగా రంగంలోకి దిగి మాటల గారడీతో మాయ చేసేవారు. ఎలాంటి కమీషన్ తీసుకోకుండా లోన్ ఇస్తామని నమ్మించి బాధితుల నుంచి ఆధార్ కార్డ్, బ్యాంక్ ఖాతాల వివరాలు సేకరించేవారు.
ఓటీపీ నెంబర్ తీసుకుని డబ్బు మాయం
ఆధార్, బ్యాంక్ వివరాలు తీసుకున్న ఒకట్రెండు రోజుల తర్వాత నిందితులు బాధితులకు తిరిగి ఫోన్ చేసేవారు. బ్యాంక్ బ్యాలెన్స్, క్రెడిట్ హిస్టరీ ఆధారంగా 5 లక్షల రుణం మంజూరైందని నమ్మబలికేవారు. అయితే లోన్ మొత్తం ఖాతాలో వేయాలంటే ముందుగా రెండు వాయిదాల సొమ్మును అకౌంట్ లో నిల్వ ఉంచాలని చెప్పావారు. ఇలా బాధితులు తమ ఖాతాలో రూ. 30 నుంచి 40వేల రూపాయలు జమ చేసేలా చూసుకునే వారు. ఆ తర్వాత రెండు రోజులకు బాధితులకు మళ్లీ ఫోన్ చేసి మీ ఖాతాలో సొమ్ము జమ అవుతోందని ఇందుకోసం మొబైల్ కు వచ్చే ఓటీపీ నెంబర్ చెప్పమని కోరేవారు. లోన్ వస్తుందన్న ఆశతో బాధితులు ఓటీపీ నెంబర్ చెప్పగానే నిందితులు వారి ఖాతాల్లోని నగదు విత్ డ్రా చేసుకుని ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసేవారు.
బాధితుల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన భాగోతం
నిందితుల ఫోన్లు పనిచేయకపోవడంతో ఇద్దరు బాధితులు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేయడంతో మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కాల్ సెంటర్ లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు వందల సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులు రోజుకు రూ.25 నుంచి రూ.30 లక్షల రూపాయల వరకు నగదు కొల్లగొట్టినట్లు ప్రాథమికంగా నిర్థారించారు. ఈ మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు 60 మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.