యశోదా నుంచి అపోలో వరకు.. 11 నిమిషాల్లో గుండె రవాణా.. ట్రాఫిక్ పోలీసులకు జనం జేజేలు (వీడియో)
Recommended Video
ఫైన్లు, చలాన్ల విధింపులో రూల్స్ ని కఠినంగా ఫాలో అయ్యే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. సాటి మనిషికి సాయం చేయడంలోనూ ముందుంటామని మరోసారి నిరూపించుకున్నారు. బ్రెయిన్ డెడ్ అయిన ఓ వ్యక్తి గుండెను ఒక ఆసత్రి నుంచి ఇంకో ఆస్పత్రికి తరలించాల్సి ఉందని డాక్టర్లు కోరిన వెంటనే.. ట్రాఫిక్ పోలీసులు హుటాహుటిన గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేశారు. గ్రీన్ ఛానెల్ అంటే.. వీవీఐపీల కోసం రోడ్లపై చేపట్టే ప్రత్యేక ఏర్పాట్లనమాట. నిజానికీ పని కొత్తదేమీ కానప్పటికీ.. తోటి మనుషుల్ని బతికించుకోడానికి జరిగే ప్రతి ప్రయత్నాన్ని ప్రతిసారి జనం మెచ్చుకుంటూనేఉన్నారు.
అసలేం జరిగిందంటే..
హైదరాబాద్ శివారులోని నాగారం(కీసర మండల పరిధి) వద్ద మూడు రోజుల కిందట ఘోర ప్రమాదం జరిగింది. బైక్ పై వెళుతోన్న విశాల్(20) అనే యువకుడు ప్రమాదవశాత్తు కిందపడటంతో తలకు బలంగా దెబ్బలు తగిలాయి. వెంటనే స్పందించిన పోలీసులు, 108 సిబ్బంది బాధితుణ్ని సికింద్రాబాద్ లోని యశోదా ఆస్పత్రికి తరలించారు. చికిత్స సమయంలో విశాల్ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమించింది. దీంతో అతను బ్రెయిన్ డెడ్ అయినట్లు డాక్టర్లు బుధవారం నిర్ధారించారు. ఈ సమాచారం తెలిసినవెంటనే జీవన్దాన్ ట్రస్టు వాళ్లు రంగంలోకి దిగారు..
ఫ్యామిలీని ఒప్పించి..
తెలుగు రాష్ట్రాల్లో అవయవదాన ప్రక్రియను క్రమబద్ధీకరించి, మంచి పేరు తెచ్చుకున్న జీవన్ దాన్ ట్రస్టు బాధ్యులు.. యశోదా ఆస్పత్రిలో విశాల్ ఫ్యామిలీతో మాట్లాడారు. బ్రెయిన్ డెడ్ అయిన విశాల్ అవయవాలను వేరొకరికి దానం చేయడానికి ఒప్పించారు. ఆ వెంటనే అందరూ కలిసి పోలీసులను ఆశ్రయించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు.. రోడ్ల మీద డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ సిబ్బంది.. నిమిషాల వ్యవధిలోనే గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేశారు.
13 కిలోమీటర్లు.. 11 నిమిషాలు..
సికింద్రాబాద్ లోని యశోదా ఆస్పత్రి నుంచి జూబ్లీ హిల్స్ లోని అపోలో ఆస్పత్రి వరకున్న దూరం సుమారు 13 కిలోమీటర్లు. గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసిన పోలీసులు.. సిగ్నళ్ల వద్ద ట్రాఫిక్ పోలీసులు పక్కా సమన్వయంతో వ్యవహరించారు. దీంతో అంబులెన్స్ ఎలాంటి ఆటంకం లేకుండా.. డ్రైవర్ బ్రేక్ వేయాల్సిన అవసరమేలేకుండా వేగంగా ముందుకు కదిలింది. మొత్తం 13 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 11 నిముషాల రికార్డు టైమ్ లో చేరుకున్నారు. అప్పటికే ఆపరేషన్ కు సిద్ధంగా ఉంచిన పేషెంట్ కు.. విశాల్ గుండెను అమర్చారు. పోలీసుల చర్యలపై సోషల్ మీడియాలో హర్షధ్వానాలు వ్యక్తమవుతున్నాయి.