అంత్యక్రియలకు అంతా సిద్దమైన వేళ... చివరి నిమిషంలో ఊహించని షాక్...
హైదరాబాద్లో ఓ ప్రైవేట్ ఆస్పత్రి నిర్లక్ష్యం కారణంగా మృతదేహాలు తారుమారయ్యాయి. ఒకరికి అప్పగించాల్సిన మృతదేహాన్ని మరొకరికి అప్పగించారు. తీరా అంత్యక్రియలకు కొద్ది క్షణాల ముందు పొరపాటును గుర్తించి అంతిమ సంస్కారాలను నిలిపివేశారు.
వివరాల్లోకి వెళ్తే.... నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం గ్రామానికి చెందిన అంకం హనుమంతు(58) ఇటీవల కరోనా బారిన పడ్డాడు. కొద్దిరోజులుగా హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం(సెప్టెంబర్ 25) ఉదయం మృతి చెందాడు. దీంతో అదేరోజు మృతదేహాన్ని అంబులెన్సులో గన్నారం తరలించి కుటుంబ సభ్యులకు గుర్తించారు.
కుటుంబ సభ్యులు అప్పటికే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయగా... మరికొద్ది క్షణాల్లో అంతిమ సంస్కారం జరుగుతుందనగా అంబులెన్సు డ్రైవర్కు ఆస్పత్రి నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చింది. మృతదేహాలు తారుమారయ్యాయని అంత్యక్రియలు నిలిపివేయాలని ఆస్పత్రి సిబ్బంది చెప్పారు. దీంతో అంబులెన్సు డ్రైవర్ హనుమంతు కుటుంబానికి అసలు విషయం చెప్పాడు. దీంతో షాక్ తిన్న కుటుంబ సభ్యులు,బంధువులు ఆస్పత్రి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ మృతదేహాన్ని తీసుకెళ్లి తమవాడి మృతదేహాన్ని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు.
Recommended Video
గతంలోనూ ఇలాంటి తరహా ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది జూన్లోని సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందగా... అతనికి బదులు మరో మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కడసారి చూపు కోసం వచ్చిన భార్య అది తన భర్త మృతదేహం కాదని గుర్తించడంతో ఈ విషయం బయటపడింది. దీంతో మృతుని కుటుంబసభ్యులు, వైద్యసిబ్బంది మధ్య వాగ్వాదం జరిగింది.చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువురికి సర్దిచెప్పారు.