కరెంటు సరఫరాపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన - విద్యుత్ శాఖకు భారీ నష్టం - ఇదీ పరిస్థితి..
హైదరాబాద్ సహా తెలంగాణ అంతటా భారీ వర్షాలు కురుస్తుండటంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. సిటీ, శివారులో వందేళ్ల తర్వాత రికార్డు స్థాయి వర్షం కురవడంతో మూసీ నది పోటెత్తింది. వందలాది ప్రాంతాలు జలమయం అయ్యాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోగా, 24 గంటలు గడుస్తున్నా పునరుద్ధరణ పనులు ముందుకు సాగడంలేదు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేశారు.
భారీ వర్షాలపై కేటీఆర్ కీలక అప్డేట్ - ఇంకో రెండు రోజులు - ముంపు బాధితులకు మంత్రి భరోసా
విద్యుత్ శాఖకు భారీ నష్టం
గడిచిన రెండు రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాల వల్ల విద్యుత్ శాఖకు భారీ నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా వరదల కారణంగా అనేక చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని, వరదలో పెద్ద సంఖ్యలో ట్రాన్స్ఫార్మర్లు కొట్టుకుపోయాయని, స్తంభాలు దెబ్బతిన్నాయని, వైర్లు తెగిపోయాయని అధికారుతు తన దృష్టికి తీసుకొచ్చినట్లు సీఎం వివరించారు. కాగా..
అందుకే పునరుద్దరణ ఆలస్యం..
గంటలు గడుస్తున్నకొద్దీ వానలు, వరదల ఉధృతి తగ్గకపోవడం, జలమయమైన ప్రాంతాలకు విద్యుత్ శాఖ సిబ్బంది చేరుకునే వీలు లేకపోవడం ప్రతికూలంగా మారిందని సీఎం తెలిపారు. హైదరాబాద్తో పాటు చాలా పట్టణాల్లో అపార్ట్మెంట్లు వరద నీటితో నిండి ఉండటంతో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించలేక పోతున్నామని, కొన్ని చోట్ల విద్యుత్ ప్రమాదాలు నివారించడానికి ముందు జాగ్రత్త చర్యగా సరఫరాను నిలిపివేశామని విద్యుత్ శాఖ అధికారులు సీఎంకు వివరించారు. పరిస్థితిని బట్టి మళ్లీ విద్యుత్ సరఫరా చేస్తున్నామని, సిబ్బంది చేరుకోగలిగిన ప్రాంతాల్లో సరఫరాను పునరుద్ధరించామని తెలిపారు.
విద్యుత్ సిబ్బందికి సీఎం ప్రశంస..
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ట్రాన్స్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావుతో విద్యుత్శాఖ పరిస్థితిపై సీఎం కేసీఆర్ బుధవారం సమీక్ష నిర్వహించారు. జెన్కో, ట్రాన్స్కో, డిస్కమ్ అధికారులతో నిత్యం పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలను కూడా విద్యుత్ విషయంలో అప్రమత్తం చేయాలని ఎండీని ఆదేశించారు. చాలా చోట్ల విద్యుత్ శాఖకు కూడా భారీ నష్టం జరిగిందని, పునరుద్ధరణ కోసం సిబ్బంది ప్రతికూల వాతావరణంలో కూడా బాగా కష్టపడుతున్నారని సీఎం అభినందించారు. వందశాతం పునరుద్ధరణ జరిగే వరకు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు.
జస్టిస్ రమణ పిల్లల భూములెక్కడో తెలుసా? జగన్-సంజీవయ్యకు తేడా ఇదే: ఎంపీ రఘురామ కీలక వ్యాఖ్యలు