హైదరాబాద్ కు వానగండం .. కష్టంగా మారిన సహాయక చర్యలు ..కట్టలు తెంచుకుంటున్న ప్రజాగ్రహం
హైదరాబాద్ లో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో భాగ్యనగర వాసులు విలవిలలాడుతున్నారు .మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. హైదరాబాద్ వాసులకు వరద సహాయక చర్యలు అందించాల్సిన జిహెచ్ఎంసి సిబ్బంది వర్ష ప్రభావంతో పూర్తి స్థాయిలో సహాయక చర్యల్లో పాల్గొనలేకపోతున్నారు . వేలాదిగా కాలనీలు నీట మునగటంతో అన్ని కాలనీలలోనూ సహాయక చర్యలు అవసరం అవుతున్నాయి కానీ అధికార యంత్రాంగం అవసరానికి తగినంత సిబ్బంది లేక దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.
యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టినా ప్రజలకు అరాకొరగానే సహాయం
ఎటు చూసినా వరద, వేల సంఖ్యలో మునిగిన కాలనీలలో పరిస్థితిని మెరుగుపరచడానికి జిహెచ్ఎంసి సిబ్బంది, విపత్తు నివారణా సిబ్బంది,ఆర్మీ , ప్రజా ప్రతినిధులు రంగంలోకి దిగినా బాధిత కాలనీలకు అందించే సహాయం అరాకొరగానే ఉంది . 24 గంటలు సహాయం అందించేందుకు పని చేస్తున్నా ఫలితం మాత్రం శూన్యం గా కనిపిస్తోంది. దీంతో పలు కాలనీలలో ఉన్న భాగ్యనగర వాసులు తినడానికి తిండి లేక, కనీసం తాగడానికి నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. పాలకుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకపక్క కరోనా కూడా భయపెడుతుంది.
పునరావాస కేంద్రాల్లోనూ ప్రజలకు తిప్పలే ..
మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నా సరే కాలనీవాసులు ఇబ్బందుల్లో ఎలాంటి మార్పు లేదు.
ఇక పునరావాస కేంద్రాలకు తరలిస్తున్న వారికి సైతం తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి . పీర్జాదిగూడ, బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలోని అనేక గ్రామాలు ఇంకా వరద ముంపులోనే ఉన్నాయి. కొందరు ఇళ్ళు ఖాళీ చేసి బంధువుల స్నేహితుల ఇళ్లకు వెళ్లిపోగా మరి కొందరు పై అంతస్తులలో తలదాచుకుంటున్నారు. వరద ముంపుతో ప్రతి ఒక్కరి ఇళ్ళలో లక్షల విలువ చేసే సామాగ్రి ,నిత్యవసర వస్తువులు తడిసి పోయాయి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఫోన్ల సిగ్నల్స్ కట్ .. కొన్ని చోట్ల ఆందోళనలకు దిగుతున్న బాధితులు
వరద సహాయక చర్యల్లో అధికారులు, ప్రజా ప్రతినిధులు పూర్తిగా విఫలమయ్యారని వారు మండిపడుతున్నారు. బోడుప్పల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నాకు దిగిన బాధితులు తమ నిరసనను తెలియజేశారు.
మరోపక్క హైదరాబాద్ జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో రవాణా సౌకర్యాలు కాదు విద్యుత్తు ఫోన్ కాల్స్ కూడా తీవ్ర ఇబ్బంది ఏర్పడుతోంది. చాలా కాలనీల్లో ఫోన్లు కూడా కలవని పరిస్థితి కాలనీ వాసులు ఇబ్బంది పెడుతోంది.
ప్రభుత్వ తీరుపై భగ్గుమంటున్న భాగ్యనగర వాసులు
ఏమైనా అత్యవసరాలు కావాలనుకుంటే సాహసం చేసి వరద నీటిలో ఈదుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితులు నగరవాసులను తీవ్ర అసహనానికి గురి చేస్తున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించేలా చేస్తున్నాయి. వేలకు వేలు పన్నులు వసూలు చేస్తున్న జిహెచ్ఎంసి కష్టకాలంలో ప్రజలకు అందించే సహాయం ఇదేనా అని పలు కాలనీవాసులు ప్రశ్నిస్తున్నారు. అధికారుల, ప్రభుత్వ తీరుపై భగ్గుమంటున్నారు. కొన్ని చోట్ల అధికారులను నిలదీస్తున్నారు. కార్పోరేటర్లపై దాడులకు కూడా వెనకాడటం లేదు . మరో మూడు రోజులు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో భయం గుప్పిట్లో భాగ్యనగర వాసులు బ్రతుకుతున్నారు.
Recommended Video