మరోసారి నం.1గా హైదరాబాద్.. సౌతిండియా న్యూయార్క్గా భాగ్య నగరం...
విశ్వ నగరంగా ఎదుగుతున్న హైదరాబాద్కు ఎప్పటికప్పుడు ప్రత్యేక గుర్తింపు లభిస్తూనే ఉంది. ప్రతీ ఏటా ఎన్నో సర్వేలు,ర్యాంకింగ్స్లో హైదరాబాద్ ముందు వరుసలో నిలుస్తోంది. తాజాగా హాలిడిఫై.కామ్ నిర్వహించిన సర్వేలో 34 అత్యుత్తమ నగరాల్లో హైదరాబాద్ నంబర్.1గా నిలిచింది.భారత్లో అత్యంత నివాస యోగ్యమైన,సుస్థిరాభివృద్ది కలిగిన,స్థిరమైన ఉపాధి కల్పించే నగరంగా హైదరాబాద్ అగ్ర స్థానంలో నిలిచినట్లు సర్వే వెల్లడించింది. అంతేకాదు,దక్షిణ భారతదేశ న్యూయార్క్ సిటీగా హైదరాబాద్ రూపాంతరం చెందుతోందని కితాబిచ్చింది.
మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన, సుస్థిరాభివృద్ధి తదితర అంశాల ప్రాతిపదికన చేపట్టిన ఈ సర్వేలో హైదరాబాద్కు 5 పాయింట్లకు గాను 4 పాయింట్లు లభించినట్లు తెలిపింది. దేశంలోని మిగతా మెట్రో నగరాలైన ముంబై,ఢిల్లీ,బెంగళూరు,పుణే,చెన్నై వంటి నగరాలను సైతం వెనక్కి నెట్టి హైదరాబాద్ అగ్ర స్థానంలో నిలవడం విశేషం.
సెప్టెంబరు-మార్చి వరకూ హైదరాబాద్లో పర్యటనకు అనువైన కాలమని సర్వే పేర్కొంది. అన్ని రకాల వ్యాపారాలకు,పరిశ్రమలకు హైదరాబాద్ అనువైన నగరమని పేర్కొంది. ఇక్కడి ప్రజలు,సంస్కృతీ,వంటలు అన్నింటికంటే అందమైన విషయాలని తెలిపింది. చారిత్రక చార్మినార్, గోల్కొండ కోటతో పాటు అనేక గొప్ప ప్రదేశాలను ఇక్కడ సందర్శించవచ్చునని చెప్పుకొచ్చింది.
గతంలో జేఎల్ఎల్(జోన్స్ ల్యాంగ్ లస్యాలే) సిటీ మొమెంటం ఇండెక్స్ 2020లోనూ ప్రపంచంలోనే అత్యంత డైనమిక్ సిటీగా హైదరాబాద్ గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ప్రతి ఏటా మెర్సర్ సంస్థ నిర్వహించే సర్వేలోనూ వరుసగా ఐదేళ్ల పాటు దేశంలో హైదరాబాద్ ముందు వరుసలో నిలుస్తూ వచ్చింది.
Many thanks Goutham 🙏 https://t.co/HsO9mhGY6i
— KTR (@KTRTRS) September 15, 2020
కాగా,తాజాగా హైదరాబాద్కు దక్కిన గుర్తింపుపై ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలంగాణ మంత్రి కేటీఆర్కు ట్విట్టర్లో కంగ్రాట్స్ చెప్పారు. దీనిపై స్పందించిన కేటీఆర్ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.