హుస్సేన్ సాగర్లో జాతీయ స్థాయి సెయిలింగ్ పోటీలు.. వారం రోజుల పాటు కనువిందు
హైదరాబాద్ : జాతీయ స్థాయి సెయిలింగ్ పోటీలకు హుస్సేన్ సాగర్ మరోసారి వేదికైంది. హైదరాబాద్ సెయిలింగ్ పోటీలను గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రారంభించారు. వారం రోజుల పాటు జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో ఔత్సాహికులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. 34వ సారి జరుగుతున్న ఈ పోటీలకు అనూహ్య స్పందన లభిస్తోంది. జాతీయ స్థాయిలో జరుగుతున్న సెయిలింగ్ పోటీలు హుస్సేన్ సాగర్లో జరుగుతుండటంపై గవర్నర్ హర్షం వ్యక్తం చేశారు.
33 సంవత్సరాలుగా నిరాటంకంగా సెయిలింగ్ పోటీలు జరుగుతుండటం విశేషం. ఈసారి తెలంగాణ సెయిలర్స్ ఛాంపియన్గా నిలవాలని ఆకాంక్షించారు గవర్నర్. జులై రెండో తేదీ మంగళవారం నాడు ప్రారంభమైన ఈ పోటీలు ఏడో తేదీ వరకు జరగనున్నాయి. సెయిలింగ్ పోటీలను తిలకించేందుకు నగరవాసులు పెద్దఎత్తున తరలివస్తుంటారు.
వాడు మామూలోడు కాదు.. స్కీమ్ పేరిట స్కామ్.. కోటి రూపాయలకు ఎసరు
వారం రోజుల పాటు కనువిందు చేయనున్న ఈ సెయిలింగ్ పోటీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన సెయిలర్స్ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచి ఛాంపియన్ షిప్ సాధించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆర్మీ, నేవీతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ప్రతి సంవత్సరం జూన్, జులై మాసంలో ఈ పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. మాన్సూన్ ప్రారంభంలో ఈ పోటీలు నిర్వహించడానికి అనుకూలంగా ఉండటంతో దాదాపు ఈ రెండు నెలల కాలంలోనే సెయిలింగ్ పోటీలు నిర్వహిస్తున్నారు.