హైదరాబాద్ శివారులో ఆర్టీసీ సర్వీసులు ప్రారంభం... సిటీ సర్వీసులపై త్వరలోనే కీలక నిర్ణయం...
హైదరాబాద్ శివారులో ఆర్టీసీ బస్సు సర్వీసులను అధికారులు పునరుద్దరించారు.రాజేంద్రనగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, బండ్లగూడ శివారు ఆర్టీసీ డిపోల్లో నుంచి బుధవారం(సెప్టెంబర్ 23) తెల్లవారుజామున ఆర్టీసీ సర్వీసులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతానికి శివారులోని ప్రతీ డిపో నుంచి 12 బస్సు సర్వీసులను నడుపుతున్నారు. మొత్తం 230 ఆర్టీసీ బస్సులను 135 రూట్లలో నడుపుతున్నట్లు గ్రేటర్ ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. సిటీ సబర్బన్ ఏరియాకు 15 కి.మీ. దూరంలోని రూట్లలో ఈ సర్వీసులు నడుపుతున్నట్లు చెప్పారు.
శివారులో ఆర్టీసీ సర్వీసులను పునరుద్దరించిన నేపథ్యంలో త్వరలోనే నగరంలోనూ ఆర్టీసీ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కరోనా లాక్ డౌన్ సడలింపుల తర్వాత రాష్ట్రమంతా ఆర్టీసీ బస్సులు నడుస్తున్నప్పటికీ... హైదరాబాద్ సిటీ సర్వీసులు మాత్రం ప్రారంభం కాలేదు.
నగరంలో కరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో హైదరాబాద్ను మినహాయించి జిల్లాల్లో బస్సులను నడుపుతున్నారు. అయితే గతంతో పోలిస్తే హైదరాబాద్లో కేసుల సంఖ్య కాస్త తగ్గడంతో 2,3 రోజుల్లో ఆర్టీసీ సిటీ సర్వీసులు కూడా ప్రారంభించే అవకాశం ఉంది. డ్రైవర్లు,కండక్టర్లు సిద్దంగా ఉండాలని ఇప్పటికే అధికారుల నుంచి ఆదేశాలు కూడా వెళ్లాయి.
హైదరాబాద్ సిటీకి నిత్యం లక్షల మంది రాకపోకలు సాగిస్తుంటారు. ప్రస్తుతం ఆర్టీసీ సిటీ సర్వీసులు లేకపోవడంతో వారంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక నగరంలో నిత్యం 33 లక్షల మంది సిటీ బస్సుల్లో ప్రయాణిస్తుంటారు. లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా అన్ని రకాల కార్యకలాపాలు ప్రారంభమవడంతో... నిత్యం ఆఫీసులు,పనులకు వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతీరోజూ పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించి ఆటోలు లేదా క్యాబ్స్లో ప్రయాణిస్తున్నారు. ఇప్పటికే మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో త్వరలోనే ఆర్టీసీ సర్వీసులను కూడా ప్రారంభించాలని వారు కోరుతున్నారు.