హైదరాబాద్లో భారీ శబ్ధంతో పేలుడు: ఒకరు మృతి, తెగిపడిన చేతులు, గణేష్ నిమజ్జనమే టార్గెటా?
హైదరాబాద్: నగరంలోని రాజేంద్రనగర్లో ఆదివారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఫుట్పాత్పై ఉన్న ఓ అనుమానాస్పద కవర్ను ఓ వ్యక్తి తెరవడంతో ఒక్కసారిగా భారీగా శబ్ధంతో పేలిపోయింది. పేలుడు ధాటికి కవర్ తెరిచిన వ్యక్తి చేతులు తెగిపడ్డాయి. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు.
ఈ ఘటనలో మరో వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యారు. పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్వే 279 పిల్లర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. గాయాలపాలైన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ జరుపుతున్నారు. ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు.. ఆధారాల కోసం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఘటనా స్తలికి బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేపట్టారు. ఆ ప్రాంతంలోని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
భారీ శబ్ధంతో పేలుడు సంభవించడంతో చుట్టు పక్కల ప్రాంతాల వాళ్లంతా ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. కాగా, పేలుడు ఘటనలో మృతి చెందిన వ్యక్తిని చెత్తను సేకరించే అలీగా గుర్తించారు.
కాగా, శనివారం రాత్రి వినాయక నిమజ్జనం ఊరేగింపు జరిగిన సమయంలో ఈ పేలుడు సంభవించివుంటే భారీగా నష్టం జరిగి ఉండేదని భావిస్తున్నారు. అయితే, ఈ బాంబు పేలుడు ప్రణాళికను గణేష్ నిమజ్జనాన్ని లక్ష్యంగా చేసుకునే చేశారా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.