హైదరాబాద్లో డ్రగ్స్ గ్యాంగ్స్... ఒకేరోజు పట్టుబడిన నలుగురు...వెలుగులోకి షాకింగ్ విషయాలు...
హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. డ్రగ్స్ విక్రయిస్తున్నారన్న సమాచారంతో బుధవారం(డిసెంబర్ 9) పోలీసులు వేర్వేరు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి నలుగురిని అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 55 ఎల్ఎస్డీ బ్లాట్స్, 3 కిలోల ఎండు గంజాయి,మూడు బైక్స్,మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నగరంలో వీరు ఎవరెవరికి డ్రగ్స్ విక్రయిస్తున్నారు... ఎక్కడినుంచి వీటిని తెప్పిస్తున్నారన్న కోణంలో పోలీసులు ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు.
పట్టుబడిన సాఫ్ట్వేర్ ఉద్యోగి...
పోలీసులు అరెస్ట్ చేసినవారిలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి కూడా ఉండటం గమనార్హం. రేతిబౌలికి చెందిన మహ్మద్ సోహెబ్ ఖాన్ (22) అనే ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆన్లైన్ ద్వారా డ్రగ్స్ ఆర్డర్ చేసి నగరంలో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. సోహెబ్కు గంజాయితో పాటు సైకడలిక్ వంటి మత్తు పదార్థాలు తీసుకునే అలవాటు ఉన్నట్లు గుర్తించారు. ఇటీవల ఆన్లైన్లో బిట్కాయిన్స్ చెల్లించడం ద్వారా 350ఎంజీ ఎల్ఎస్డీ బ్లాట్స్ 100 వరకు కొనుగోలు చేసినట్లు నిర్దారించారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆయా వ్యక్తుల నుంచి ఆర్డర్ తీసుకుని నగరంలో వీటిని విక్రయిస్తున్నట్లు నిర్దారించారు.
ఒక్కో బ్లాట్ రూ.2వేలు...
ఒక్కో ఎల్ఎస్డీ బ్లాట్ రూ.850కి కొనుగోలు చేసే సోహెబ్.. కస్టమర్లకు రూ.1700-రూ.2వేలు వరకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. సోహెబ్ వ్యవహారంపై ఇటీవల పోలీసులకు సమాచారం అందింది. దీంతో టాస్క్ఫోర్స్ సిబ్బంది రంగంలోకి దిగి అతని కదలికలపై నిఘా పెట్టారు. బుధవారం(డిసెంబర్ 9) అతను మెహిదీపట్నం కేఎఫ్సీ వద్ద ఓ కస్టమర్కు ఎల్ఎస్డీ విక్రయించేందుకు వచ్చాడు. అప్పటికే అక్కడ మాటు వేసి ఉన్న టాస్క్ఫోర్స్ పోలీసులు చాకచక్యంగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 55 ఎల్ఎస్డీ బ్లాట్స్, హోండా యాక్టివా వాహనం, మొబైల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
మరో ముగ్గురి అరెస్ట్...
నగరంలోని బోయినపల్లి ఆశిష్ గార్డెన్ ప్రాంతంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులకు మరో యువకుడు గంజాయితో పట్టుబడ్డాడు.యువకుడిని రాజన్నగారి సందీప్రెడ్డి(29)గా గుర్తించిన పోలీసులు... అతని వద్ద నుంచి కిలో ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బాలానగర్కి చెందిన బొల్లా దుర్గాప్రసాద్, మూసాపేట ప్రాంతానికి చెందిన కంచర్ల సత్య నారాయణ అలియాస్ సత్తిబాబు(25)ల పేర్లను విచారణలో సందీప్ వెల్లడించాడు. వాళ్లే తనకు గంజాయి విక్రయిస్తున్నట్లు చెప్పాడు. దీంతో పోలీసులు ఆ ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు.
Recommended Video
అరకు,ఒడిశా నుంచి...
ఆ ఇద్దరితో పాటు కుత్బుల్లాపూర్కు చెందిన శివాజీ అనే మరో వ్యక్తి కూడా డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లంతా అరకు, ఒడిశా నుంచి కిలో గంజాయి రూ.3 వేలకు కొనుగోలు చేసి, నగరంలో కిలో రూ.5 వేలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. దుర్గా ప్రసాద్,సత్తిబాబుల నుంచి రెండు బైక్స్, మూడు సెల్ఫోన్లతో పాటు 3కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.