గుడ్ న్యూస్: మీ పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్ ఇస్తోంది ట్రాఫిక్ డిపార్ట్మెంట్..ఎంతో తెలుసా?
మీరు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించి జరిమానాకు గురయ్యారా..? ఎప్పటికప్పుడు జరిమానా కట్టకుండా ఆ ఏముందిలే అని అలసత్వంతో ఉన్నారా..? మూరెడంత ఉన్న జరిమానా ఒక్కసారిగా బారెడు అయ్యిందా...? ఇప్పుడు ఈ జరిమానా కట్టలేక పోతున్నారా... అయితే మీ కోసమే ఈ గుడ్ న్యూస్. అంత డబ్బులు ఒకేసారి కట్టలేని వారికి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ డిస్కౌంట్ ఇవ్వాలని అనుకుంటోంది. ఇందుకు సంబంధించిన ఫైలును కూడా ప్రభుత్వం వద్దకు ఆమోదం కోసం పంపింది.
నగరంలో పెండింగ్లో ఉన్న చలాన్లు విలువ రూ. 63 కోట్లకు చేరింది. ఎవరైనా ట్రాఫిక్లో రెడ్ సిగ్నల్ పడినప్పటికీ సిగ్నల్ జంప్ కావడం, హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం, విపరీతమైన వేగంతో వాహనం నడపడం, ట్రాఫిక్ నిబంధనలను పాటించకపోవడం వంటి వారి భరతం పట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికక్కడ డిజిటల్ కెమెరాలు అమర్చారు. ఇక అవి తీసే ఫోటోలను నేరుగా ఇంటర్నెట్లో పెట్టేస్తున్నారు. మరికొన్ని సార్లు చలాన్లను ఇంటికి పోస్టు ద్వారా పంపిస్తున్నారు. అయినప్పటికీ నిబంధనలను ఉల్లఘించిన వారు ఈ జరిమానాలను పట్టించుకోవడం లేదు. ఇందుకోసమే ఓ వినూత్నమైన ఆలోచన చేసింది ట్రాఫిక్ విభాగం. జరిమానాపై డిస్కౌంట్ ఇవ్వాలని భావిస్తోంది.
ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడి జరిమానా కట్టలేని వారికోసం డిస్కౌంట్ ఆఫర్ ఇచ్చింది కోల్కతా ట్రాఫిక్ డిపార్ట్మెంట్. ఇది అక్కడ సక్సెస్ కావడంతో హైదరాబాదులో కూడా అమలు చేయాలని మన ట్రాఫిక్ విభాగం భావిస్తోంది. ఇప్పటికే తెలంగాణలో పలు నగరాల్లో ఈ తరహా విధానం నడుస్తోంది. ఇప్పుడు ప్రభుత్వ అనుమతి పొంది తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా డిస్కౌంట్ అమలు చేయాలని ట్రాఫిక్ శాఖ భావిస్తోంది. 25 శాతం నుంచి 50 శాతం వరకు డిస్కౌంట్ ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఆ ఫైలును రాష్ట్ర ప్రభుత్వ ఆమోదానికి పంపింది. ఒక వేళ విదేశాల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి జరిమానా కట్టకుంటే నేరుగా జైలులో ఊచలు లెక్కబెట్టాల్సి ఉంటుంది.