మీకే ఆ రోల్.. సీరియల్లో ఛాన్స్ ఇప్పిస్తానంటూ.. మహిళను నిండా ముంచి..!
హైదరాబాద్ : మీకే ఆ రోల్ అంటూ నమ్మించాడు. సీరియల్లో ఛాన్స్ ఇప్పిస్తానంటూ మాయమాటలు చెప్పాడు. అంతవరకు బాగానే ఉన్నా.. అసలుకే ఎసరు వచ్చింది. రోల్ లేదు, సీరియల్ లేదు.. ఉల్టా లక్ష రూపాయల వరకు కాజేశాడు మోసగాడు. హైదరాబాద్కు చెందిన మహిళను ముంబైకి చెందిన మాయగాడు మోసం చేసిన ఘటన వెలుగు చూసింది.
హైదరాబాద్లోని రాంకోఠి ప్రాంతానికి చెందిన 40 సంవత్సరాల మహిళకు యాక్టింగ్ అంటే ఇష్టం. ఆ క్రమంలో ఆమె మోడల్గా, చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ వచ్చారు. అయితే ఇటీవల ముంబైకి చెందిన అంజు అలియాస్ చక్రవర్తి అనే వ్యక్తి ఫేస్బుక్లో పరిచయమయ్యాడు. అదే ఆమె కొంప ముంచింది. ఆ పరిచయంతో కాస్తా ఆమెను బురిడీ కొట్టించాడు. పెద్ద యాడ్లో నటించే అవకాశం ఇప్పిస్తానని మాయ మాటలు చెప్పి మోసగించాడు.
ఒక్క ఎమ్మెల్యే కోసం ఎన్ని కష్టాలో.. ఆ గుర్తులు కొంప ముంచేనా?
ఫలానా యాడ్లో మీరే నటిస్తున్నారంటూ చెప్పుకొచ్చిన అంజు.. మిగతా వివరాలు మా అసిస్టెంట్ రాకేశ్ మాట్లాడతాడంటూ తెలిపాడు. ఆ క్రమంలో లైన్లోకి వచ్చిన రాకేశ్.. అది ఇదంటూ ఫీజుల పేరిట భారీగా డబ్బులు గుంజాడు. చివరకు విమాన టికెట్లు బుక్ చేయిస్తానంటూ ఆమె నుంచే మరికొంత నొక్కేశాడు. ఇదంతా కూడా అంజు కనుసన్నల్లో జరిగింది. డబ్బులు తీసుకుంటున్నారే తప్ప రోల్ గురించి మాట దాటవేస్తూ కాలం గడిపారు.
ప్రతిసారి వాళ్లు డబ్బులు అడగటం.. ఈమె పంపించడం.. అదే పనిగా మారింది. అంతేకాదు తమకు కమిషన్ ఇవ్వాల్సి ఉందంటూ మరో 15 వేల రూపాయలు నొక్కేశారు. అలా ఆమె నుంచి లక్ష రూపాయల దాకా వసూలు చేసిన ఆ కేటుగాళ్లు ఆ తర్వాత ఫోన్లు స్విచ్చాఫ్ చేశారు. అప్పటికీ గానీ తాను మోసపోయిన విషయం గుర్తించలేదు బాధితురాలు. చివరకు సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి కేసు ఫైల్ చేశారు.