coronavirus: నిబంధనలకు పాతర వేస్తున్న యువత, సిటీలో యథేచ్చగా రోడ్లపైకి వస్తూ..
కరోనా వైరస్ విస్తరించడంతో సామాజిక దూరం పాటించాలని కేంద్ర ప్రభుత్వం మూడు వారాలపాటు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో వైరస్ కేసులు పెరుగుతుండటంతో.. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కూడా విధిస్తున్నారు. కానీ ఆకతాయిలు మాత్రం ఆగడం లేదు. పోలీసులు చెబుతోన్నా... సిబ్బంది నెత్తి నోరు బాదుకుంటోన్న యధేచ్చగా రోడ్లపైకి వస్తున్నారు.
విశ్వనగరి భాగ్యనగరంలో మాత్రం కొందరు పెడచెవిన పెడుతున్నారు. లాక్ డౌన్ ఉల్లంఘిస్తున్నారు. సాయంత్రం 6 గంటల వరకు 3 కిలోమీటర్ల పరిధిలో మాత్రమే వెళ్లాలని చెబుతోన్న.. టూ వీలర్స్ మాత్రం చెవికెక్కించుకోవడం లేదు. టూ వీలర్పై ఒక్కరు, కారులో ఇద్దరు వెళ్లాలని నిబంధన ఉంటే.. బైక్పై దర్గాగా ఇద్దరు వెళుతున్నారు. అత్యవసరం కాదు కదా.. ఏ పని లేకున్నా సరదాగా రోడ్లపైకి తిరిగేందుకు వస్తున్నారు.
ఆంక్షలు ఉన్న రోడ్లపైకి రావడంతో పోలీసులు కూడా లాఠీ ఝులిపిస్తున్నారు. కొన్నిచోట్ల వాహనాలు కూడా సీజ్ చేస్తున్నారు. ఆకతాయిలకు బడితేపూజ చేస్తున్నారు. అత్యవసరం ఉంటే రావాలని, తమకు చెబితే సాయం చేస్తామని చెబుతున్నారు. కానీ నిబంధనలకు పాతర వేస్తున్న వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు.