హైదరాబాద్కు అరుదైన అతిథులు.. పిల్లలందరూ ఎగిరి గంతేస్తారు.. పలకరించడానికి సిద్ధంకండి..
విశ్వనగరం హైదరాబాద్లోకి అరుదైన అతిథులు అడుగుపెట్టబోతున్నారు. చెంగుచెంగున ఎగురుతూ మనల్ని కనువిందు చేయనున్నాను. రాబోయే సమ్మర్ లో పిల్లలకు, పెద్దలకు చక్కటి అనుభూతి కలిగించేలా.. నగరంలోని ప్రఖ్యాత నెహ్రూ జూపార్క్ లోకి రెండు కంగారు జంటలు, ఓ మీర్కట్ జంట రానున్నాయి. ఇండియా వాతావరణంలో కంగారులు బతకలేవనే వాదనల నడుమ.. జంతువుల మార్పిడి కార్యక్రమంలో భాగంగా వీటిని జపాన్ నుంచి తీసుకొస్తున్నారు. అంతా బాగుంటే ఆ అతిథులు శాశ్వతంగా ఇక్కడే ఉండిపోయినా ఆశ్యర్యపోనవసరంలేదు.
తరలింపు ప్రక్రియ..
జపాన్ లోని యొకొహోమా గార్డెన్, హైదరాబాద్ లోని నెహ్రూ జూపార్క్ మధ్య ఈ మేరకు ఒప్పందాలు కుదిరాయని, కేంద్ర, రాష్ట్రాల అటవీ, పర్యావరణ శాఖ, సెంట్రల్ జూ అథారిటీ, విదేశీ వాణిజ్య వ్యహారాల డైరెక్టర్ జనరల్ అనుమతి లభించిన తర్వాత తరలింపు ప్రక్రియ ఉంటుందని, మొత్తానికి ఎండాకాలం సెలవులు మొదలయ్యేనాటికి కంగారులు రంగప్రవేశం చేస్తాయని నెహ్రూ జూపార్క్ క్యూరేటర్ ఎన్.క్షితిజ వెల్లడించారు.
మొత్తం ఎన్ని జీవాలో తెలుసా?
380 ఎకరాల్లో విస్తరించిన నెహ్రూ జూపార్క్ లో ప్రస్తుతానికి 173 జాతులకు చెందిన 1800 జీవాలు ఉన్నాయని, కొత్తగా రాబోయే కంగారు, మీర్కట్ ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని, పనులు దాదాపు చివరిదశకు చేరుకున్నాయని క్యూరేటర్ వివరించారు. జంతువుల మార్పిడి కార్యక్రమంలో భాగంగా గతేడాది నెహ్రూ జూపార్కుకు రెండు హిప్పోపొటామస్, సింహంలాంటి తోకలుండే రెండు ముకాన్, బూడిద రంగు తోడేలు, లంగూర్, జిరాఫీల జంట, నాలుగు కింగ్ కోబ్రాలను తీసుకొచ్చినట్లు తెలిపారు.
కంగారులు ఇక్కడ బతుకుతాయా?
ఆస్ట్రేలియాలో ఎక్కువగా కనిపించే కంగారులు.. ఆఫ్రికాలోని కలహారి ఎడారిలో జీవించే మీర్కట్లు.. భారత ఉపఖండం వాతావరణంలో బతకగలవా? లేదా? అనే విషయంపై జీవశాస్త్రవేత్తలు పెద్ద ఎత్తున పరిశోధనలు చేశారు. ఇండియాలోనూ కంగారులు సంచరించినట్లు పురాతత్వ శాస్త్రవేత్తలూ ఓ అవగాహనకు వచ్చారు. వీటి నేపథ్యంలో రెండేళ్ల కిందట.. ఇదే జపాన్ నుంచి రెండు కంగారులను కోల్ కతాలోని కనజావా జూపార్కుకు తీసుకొచ్చారు. ప్రత్యేకంగా పెంచిన గడ్డిని, వాటిని అనువైన వాతావరణాన్ని కల్పించడంతో కంగారులు మనగలుగుతున్నాయి. హైదరాబాద్ నెహ్రూ జూపార్క్ లోనూ అదే తరహా ఏర్పాటు చేస్తున్నారు.