కేటీఆర్-ఎన్ రామచంద్రరావు మధ్య ట్వీట్ల వార్: బీజేపీ కార్నర్: ఎన్డీఏకు కొత్త అర్థం
హైదరాబాద్: తెలంగాణలో ప్రస్తుతం శాసన మండలి ఎన్నికల వేడి కొనసాగుతోంది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్, నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల స్థానాలకు ఎన్నికలను నిర్వహించడానికి నోటిఫికేషన్ వెలువడింది. ఈ రెండు చోట్లా ముక్కోణపు పోటీ ఏర్పడింది. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి-కాంగ్రెస్-బీజేపీ మధ్య గట్టిపోటీ నెలకొంది. తెలంగాణ జన సమితి చీఫ్ కోదండరామ్, వామపక్షాలు బలపరిచిన ప్రొఫెసర్ నాగేశ్వర్తో పాటు తీన్మార్ మల్లన్న, రాణి రుద్రమరెడ్డి వంటి తటస్థులు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తోన్నారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్నారు.
పవన్ కల్యాణ్కు షాకిచ్చిన అమిత్ షా..తప్పని నిరాశ: మళ్లీ ఎదురుచూపులే: టూర్ క్యాన్సిల్
పట్టు నిలుపుకోవడంపై బీజేపీ..
సిద్ధిపేట్ జిల్లా దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బరిలో నిరూపించుకున్న బలాన్ని, నిలుపుకొన్న పట్టును కొనసాగించాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. దీనికోసం అధికార టీఆర్ఎస్ వైఫల్యాన్ని ప్రాతిపదికన చేసుకుని, ప్రచారాన్ని సాగిస్తోంది. పట్టభద్రుల నియోజకవర్గం కావడంతో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ నియోజకవర్గం నుంచి శాసన మండలి రేసులో నిల్చొన్న బీజేపీ సీనియర్ నేత ఎన్ రామచంద్ర రావు.. నిరుద్యోగ అంశాన్ని ప్రధానంగా తన ప్రచారంలో ప్రస్తావిస్తోన్నారు.
ఉద్యోగాలేవీ..
తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఈ ఆరున్నరేళ్ల వ్యవధిలో యువత నిరుద్యోగం పాలైందంటూ ఎన్ రామచంద్రరావు విమర్శలను సంధిస్తోన్నారు. స్వరాష్ట్రం ఏర్పడినా తెలంగాణ యువతకు నిరుద్యోగ బాధలు తీరట్లేదని ఆయన ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తోన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం రోడ్లపై ఎర్రటెండల్లో యువత ధర్నాలు, నిరసనలు, లాఠీ దెబ్బలను చవి చూశారని, జైలు పాలయ్యారని విమర్శించారు. అధికారం వచ్చాక కూడా యువత అలాంటి పరిస్థితులనే ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగంపై చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు.
ఉస్మానియా యూనివర్శిటీలో
నిరుద్యోగ అంశంపై చర్చించడానికి తాను ప్రస్తుతం ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్లో సిద్ధంగా ఉన్నానంటూ రామచంద్ర రావు మంత్రి కేటీఆర్కు సవాల్ చేశారు. ఆయన కోసం వెయిట్ చేస్తున్నానిక్కడ.. అంటూ ట్వీట్ చేశారు. టీఆర్ఎస్కు నమ్మి అధికారమిస్తే.. యువతను నట్టేట ముంచారని ఆరోపించారు. యువతను బానిసత్వంలో ముంచడమే తప్ప ఉద్యోగాలను ఇవ్వలేదని, ఇంటికొక్క ఉద్యోగం ఇస్తామన్న హామీ ఏమైందని నిలదీశారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. తన కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. ఈ ట్వీట్ను కేటీఆర్కు ట్యాగ్ చేశారు.
హిలేరియల్ రిప్లై ఇచ్చిన కేటీఆర్..
ఎన్ రామచంద్రరావు చేసిన ట్వీట్కు కేటీఆర్ హిలేరియస్ రిప్లై ఇచ్చారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటిదాకా ఇచ్చిన ఉద్యోగాల వివరాలను తెలుసుకోవడం బిజీగా ఉన్నానని బదులిచ్చారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలను ఇస్తామనే హామీతో ఎన్డీఏ.. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. ఏటేటా రెండు కోట్లు చొప్పున ఈ ఆరేళ్ల కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం 12 కోట్ల ఉద్యోగాలను ఇవ్వాల్సి ఉందని, ఆ డేటాను కలెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నానని అన్నారు. అలాగే- జన్ధన్ ఖాతాల్లో 15 లక్షల రూపాయల చొప్పున డబ్బులను వేస్తామంటూ ప్రధాని ఇచ్చిన హామీ గురించి ఆరా తీస్తోన్నానని సమాధానమిచ్చారు. ఎంత వెదుకుతున్నా ఎలాంటి డేటా దొరకట్లేదని అన్నారు. ఎన్డీఏ అంటే.. నో డేటా అవైలబుల్ అని కొత్త అర్థం చెప్పారు.