సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడుతో నాకు ప్రాణహాని... నటి శ్రీసుధ పోలీసులకు ఫిర్యాదు...
టాలీవుడ్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె.నాయుడితో తనకు ప్రాణహాని ఉందని సినీ నటి శ్రీసుధ మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో ఆయనపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని తనను బెదిరింపులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. శుక్రవారం(జనవరి 22) హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్ పోలీసులను ఆమె ఆశ్రయించారు. శ్రీసుధ ఫిర్యాదు మేరకు పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
గతంలో రెండుసార్లు ఫిర్యాదు..
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఐదేళ్లు తనతో సహజీవనం చేసిన శ్యామ్ కె.నాయుడు.. ఆ తర్వాత తనను మోసం చేశారని గత ఏడాది మే 26న శ్రీసుధ మొదటిసారి ఎస్ఆర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో తాను రాజీ కుదుర్చుకున్నట్లు నకిలీ పత్రాలు సృష్టించి కోర్టును తప్పుదోవ పట్టించడం ద్వారా శ్యామ్ కె.నాయుడు బెయిల్ పొందారని రెండోసారి శ్రీసుధ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ పత్రాలు నకిలీవని తేలడంతో అప్పట్లో ఆయన బెయిల్ కూడా రద్దయింది.
Recommended Video
శారీరక దాడికి పాల్పడ్డారు : శ్రీసుధ
తాజాగా ఇచ్చిన ఫిర్యాదులో శ్యామ్ కె నాయుడుతో పాటు సినీ ఆర్ట్ డైరెక్టర్ చిన్నా,స్టిల్ ఫోటోగ్రాఫర్ సాయిరాం మాగంటిల పేర్లను కూడా శ్రీసుధ ప్రస్తావించారు. గతేడాది అగస్టు 5న మాదాపూర్లోని చిన్నా నివాసానికి పిలిపించి శ్యామ్ కె నాయుడు,చిన్నా,సాయిరాం మాగంటితో పాటు తదితరులు తనను బెదిరింపులకు గురిచేశారని పేర్కొన్నారు. తనను దూషించడంతో పాటు,శారీరకంగా దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. సినీ ఇండస్ట్రీలో కొనసాగాలంటే రాజీపడక తప్పదని హెచ్చరించారని చెప్పారు.
ప్రాణభయం ఉన్నందునే మళ్లీ ఫిర్యాదు
భయంతో అప్పటినుంచి తాను ఈ విషయాలేవీ ఎవరికీ చెప్పలేదని... కానీ శ్యామ్ కె నాయుడు కుటుంబ సభ్యులతో ప్రాణభయం ఉన్నందునా మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని శ్రీసుధ తెలిపారు. శ్యామ్ కె. నాయుడిని ఇంత వరకు అరెస్ట్ చేయలేదన్న విషయాన్ని కూడా ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెప్పారు. నటి శ్రీసుధ కేసును ఎస్ఆర్ నగర్ పోలీసులు మాదాపూర్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేసే అవకాశం ఉంది.