బీజేపీలోకి తేరా..? జోరుగా ప్రచారం.. అబ్బే అదేం లేదంటోన్న నేత.. గులాబీ దళంలోనే..
నాగార్జున సాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో రాజకీయ పరిణామాలు చక చకా మారిపోతున్నాయి. టికెట్ ఆశిస్తోన్న నేతలు.. పార్టీ మారేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఇంతలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే తేరా చిన్నపరెడ్డి పేరు వినిపించింది. ఆయన బీజేపీ టికెట్ ఆశిస్తున్నారని రూమర్లు వినిపిస్తున్నాయి. దీనిపై చిన్నపరెడ్డి స్పందించారు. అదేం లేదని.. తాను టీఆర్ఎస్లోనే కొనసాగుతానని స్పష్టంచేశారు.
అబ్బే.. అదేం లేదే..
బీజేపీలో చేరుతున్నారనే వార్తలను టీఆర్ఎస్ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి ఖండించారు. కేసీఆర్కు, టీఆర్ఎస్ పార్టీకి విధేయుడునని చెప్పారు. తనకు ఎమ్మెల్యేగా మరో ఏడాది కొనసాగే అవకాశం ఉందని చెప్పారు. అయినా తాను పార్టీ మారడం లేదని తేల్చిచెప్పారు. తనను బీజేపీ నేతలు సంప్రదించారనేది నిజం కాదని తోసిపుచ్చారు. తాను ఎవరితో చర్చలు జరపలేదని వివరించారు. ప్రస్తుతం హైదరాబాద్లోని ఫిల్మ్నగర్లో గల తన నివాసంలో ఉన్నానని చిన్నపరెడ్డి పేర్కొన్నారు.
గతంలో ఓటమి...
నాగార్జునసాగర్లో గతంలో జానారెడ్డిపై పోటీ చేసి చిన్నపరెడ్డి ఓడిపోయారు. ఆయన బీజేపీ వైపు చూస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ఆయన టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నారు. హైదరాబాద్లోని ఓ రహస్య ప్రదేశంలో బీజేపీ ముఖ్యనేతలను చిన్నపరెడ్డి కలిశారని.. నాగార్జునసాగర్ టికెట్ హామీ ఇస్తే బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని బీజేపీ ముఖ్య నేతలు చెప్పినట్లు సమాచారం.
నోముల మృతితో..
టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య చనిపోవడంతో నాగార్జునసాగర్ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. తమ సిట్టింగ్ స్థానమైన నాగార్జునసాగర్ను తిరిగి సొంతం చేసుకోవాలని టీఆర్ఎస్ పట్టుదలగా ఉంది. దుబ్బాక విషయంలో జరిగినట్టు సాగర్ విషయంలో జరగొద్దని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటికే ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరపున ఆ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి బరిలోకి దిగడం దాదాపుగా ఖాయమైంది. ఇక టీఆర్ఎస్ తరపున నోముల నర్సింహయ్య కుటుంబసభ్యులకు అవకాశం ఇస్తారా లేదా.. వేరే వారిని బరిలోకి దింపుతారా అన్నది తేలాల్సి ఉంది.
Recommended Video
గుత్తా లేదంటే తేరా
నాగార్జునసాగర్ బరిలో నోముల నర్సింహయ్య కుటుంబసభ్యులకు టికెట్ ఇవ్వకపోతే.. బీసీలకు కాకుండా రెడ్డి వర్గానికి చెందిన నేతలకు సీటు ఇవ్వొచ్చనే ప్రచారం సాగుతోంది. గుత్తా సుఖేందర్ రెడ్డి, తేరా చిన్నపరెడ్డి పేర్లు తెరపైకి వచ్చాయి. ఇక ఇక్కడి అభ్యర్థి ఎంపిక విషయంలో టీఆర్ఎస్ నిర్ణయం తీసుకునే వరకు వేచి చూడాలని బీజేపీ భావిస్తోంది. బీజేపీ తరపున నాగార్జునసాగర్ బరిలో నిలిచేందుకు నివేదితా రెడ్డి, అంజయ్య యాదవ్ పోటీ పడుతున్నారు. ఒకవేళ తేరా చిన్నపరెడ్డి నిజంగానే బీజేపీలో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేస్తే నాగార్జునసాగర్ ఉప ఎన్నిక మరింత రసవత్తరంగా మారే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.