సెల్యూట్ టు కరోనా వారియర్స్: గాంధీ ఆస్పత్రిపై హెలికాప్టర్లతో పూల వర్షం
హైదరాబాద్: కరోనా మహమ్మారిని పారద్రోలడంలో ముఖ్య భూమిక పోషిస్తున్న వైద్యులకు దేశ వ్యాప్తంగా అరుదైన గౌరవం లభించింది. భారత ఆర్మీ ప్రకటించిన మేరకు కోవిడ్ ఆస్పత్రుల వైద్యులపై హెలికాప్టర్లతో పూల వర్షం కురిపించారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు, ఆరోగ్యశాఖ సిబ్బంది, పోలీసులను సత్కరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.
Recommended Video
ప్రాణాలు పణంగా పెట్టిన వైద్యులకు..
ప్రాణాలను పణంగా పెట్టి కరోనా సోకిన బాధితులకు అన్నీ తామై వ్యవహరిస్తున్న వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది సేవలకు కృతజ్ఞతగా గాంధీ ఆస్పత్రిపై, వైద్యులపై భారత వాయుసేన ఆధ్వర్యంలో పూల వర్షం కురిపించారు. ఆస్పత్రి ప్రాంగణంలోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్ద హకీంపేట నుంచి వచ్చిన హెలికాప్టర్ గులాబీ పూల వర్షం కురిపించింది.
అరుదైన గౌరవం..
వైద్య, సిబ్బంది అంకితభావానికి లభించిన అరుదైన గౌరవంగా భావిస్తున్నామని ఈ సందర్భంగా గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ ఎం రాజారావు తెలిపారు. గాంధీ ఆస్పత్రి వద్ద పలువురు నేతలు వైద్యులకు సంఘీభావం తెలుపుతూ జాతీయ జెండాను ప్రదర్శించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ గాంధీ ఆస్పత్రి మీడియాతో మాట్లాడారు. కరోనా వ్యాధికి సమాజానికి మధ్యలో గోడలా పోలీసులు, వైద్యులు ఉన్నారని తెలిపారు. దేశ సరిహద్దుల వద్ద రక్షణ కల్పిస్తున్న సాయుధ దళాలు.. అంతర్గత భద్రత కాపాడుతున్న యోధులకు గౌరవించాయని అన్నారు.
హైదరాబాద్, విశాఖతోపాటు దేశ వ్యాప్తంగా..
కాగా, హైదరాబాద్ తోపాటు విశాఖపట్నం, చెన్నై, బెంగళూరు, దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న కోవిడ్ ఆస్పత్రులపై హెలికాప్టర్లతో పూల వర్షం కురిపించాయి. విశాఖపట్నంలోని ఛాతి, అంటు వ్యాధుల ఆస్పత్రి, గీతం ఆస్పత్రులపై వాయుసేన సిబ్బంది హెలికాప్టర్తో ఆదివారం ఉదయం పూల వర్షం కురిపించారు. వైద్యులను రక్షణ దళాల అధికారులు సత్కరించారు. ఢిల్లీలోని పోలీస్ యుద్ధస్మారకం వద్ద వైమానిక హెలికాప్టర్లు పూల జల్లులు కురిపించాయి. కాగా, విశాఖ, ముంబై, చెన్నై, కొచ్చిలోని నౌకలకు ఆదివారం రాత్రి 7.30గంటల నుంచి 11.59 నిమిషాల వరకు దీపాలాంకరణ చేయనున్నారు.