సీఎంతో త్రిసభ్య కమిటీ సభ్యుల భేటీ, ఆర్టీసీ డిమాండ్లపై వివరణ, ప్రత్యామ్నాయాలు ఇవే..
తమ డిమాండ్లపై ఆర్టీసీ జేఏసీ బెట్టువీడకపోవడంతో ఆర్టీసీలో సమ్మె అనివార్యమైంది. అర్ధరాత్రి నుంచి బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోనున్నాయి. ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న సీఎం కేసీఆర్తో త్రిసభ్య కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. ఆర్టీసీ జేఏసీ నేతల డిమాండ్లను సీఎంకు వివరిస్తున్నారు. ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కార్మికులతో జరిగిన చర్చల సారాంశాన్ని వారు సీఎం దృష్టికి తీసుకొచ్చారు.
ఆర్టీసీలో సమ్మె అనివార్యమైన నేపథ్యంలో ప్రత్యామ్నాయాల గురించి సీఎంకు త్రిసభ్య కమిటీ సభ్యులు వివరిస్తున్నారు. దీనికి సంబంధించి కాసేపట్లో కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా దసరా పండగ సందర్భంగా ప్రయాణికులకు ఇబ్బంది కలిగించొద్దని చెప్పిన వినిపించుకోలేదని త్రిసభ్య కమిటీ సభ్యులు కేసీఆర్కు వివరించారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, పీఆర్సీ, ఐఆర్ తదితర 26 డిమాండ్లపై బెట్టు చేస్తున్నారని కమిటీ సభ్యులు చెప్తున్నారు.
కార్మికులు సమ్మె చేయడంతో స్కూల్ బస్సు డ్రైవర్లతో బస్సులు నడిపించాలని యాజమాన్యం భావిస్తోంది. ఒక్కో డ్రైవర్కు రోజుకు రూ.1500, కండక్టర్కు రూ.వెయ్యి ఇవ్వాలని నిర్ణయించారు. ఈ అంశాన్ని సీఎంకు వివరిస్తున్నారు. దీనికి కేసీఆర్ ఆమోదం తెలిపితే.. ఇప్పటికే ఆగిపోయిన బస్సులను పునరుద్ధరించనున్నారు. ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా అన్నీ చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.