తెలంగాణ సీఎం కేసీఆర్ సెక్రటరీగా ఐఏఎస్ శేషాద్రి నియామకం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సెక్రటరీగా సీనియర్ ఐఏఎస్ వి. శేషాద్రి నియమితులయ్యారు. 1999 బ్యాచ్కు చెందిన శేషాద్రి ఐదున్నరేళ్లుగా కేంద్ర సర్వీసుల్లో పనిచేశారు. ఇందులో భాగంగా ప్రధాని కార్యాలయంలోనూ కీలక బాధ్యతలు నిర్వర్తించారు. కొన్ని రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్ట్ చేయగా...రెవెన్యూ చట్టాలు,భూ చట్టాల సమీక్ష బాధ్యతలను ప్రభుత్వం ఆయనకు అప్పగించింది.
రెవెన్యూ చట్టాలపై మంచి పట్టు ఉన్న శేషాద్రి ఆ శాఖపై తనదైన ముద్ర వేశారు. అత్యంత విలువైన భూములున్న రంగారెడ్డి జిల్లాలో జాయింట్ కలెక్టర్గా, కలెక్టర్గా పనిచేశారు.రికార్డ్ ఆఫ్ రైట్(ఆర్వోఆర్) చట్టాన్ని అనుసరించి ఆయన ఇచ్చిన ఉత్తర్వులు చిరస్థాయిగా నిలిచిపోతాయని రెవెన్యూ అధికారులు చెబుతుంటారు. శేషాద్రి యూఎల్సీ ప్రత్యేకాధికారిగా కూడా ఉన్నారు. బెంగళూరులోని నేషనల్ స్కూల్ ఆఫ్ లా నుంచి పట్టభద్రుడైన శేషాద్రికి సమర్థుడైన అధికారిగా,మితభాషిగా పేరుంది.
నిజానికి భూపరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్ఏ), రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పోస్టుల్లో ఏదో ఒకటి శేషాద్రికి కట్టబెడుతారన్న ఊహాగానాలు వినిపించాయి. కానీ ముఖ్యమంత్రి సెక్రటరీగా నియమితులయ్యారు.