మాదాపూర్ శిల్పకళావేదిక స్టేజ్ నుండి పడిపోయి ఐబీ డీఎస్పీ మృతి; హైదరాబాద్ లో విషాదం
హైదరాబాద్ మాదాపూర్ పరిధిలో ఉన్న శిల్పకళావేదిక వద్ద విషాద ఘటన చోటుచేసుకుంది. శిల్పకళా వేదికలో జరగనున్న దివంగత పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్యఅతిథిగా రానున్నారు. ఈ క్రమంలో ఈ కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలించి, ఉప రాష్ట్రపతి పర్యటనకు నివేదిక ఇవ్వడం కోసం అక్కడకు వచ్చిన ఇంటెలిజెన్స్ బ్యూరోలో డీఎస్పీగా పనిచేస్తున్న కుమార్ అమ్మిరేష్ ఆకస్మిక మరణం చోటు చేసుకుంది.
శిల్పకళావేదిక ముందు ఉన్న గుంతలో పడిపోయారు. తీవ్ర గాయాలపాలైన ఆయనను ఆసుపత్రికి తీసుకు వెళ్లినప్పటికీ ఫలితం లేకపోయింది. తలకు తీవ్ర గాయం కావడంతో చికిత్స పొందుతూ కుమార్ అమ్మిరేష్ మృతి చెందారు.సిరివెన్నెల సీతారామశాస్త్రి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరు కానున్న నేపథ్యంలో, ఈ కార్యక్రమం ఏర్పాట్లపైనా నివేదిక ఇవ్వడం కోసం స్టేజిపై నుంచి ఫొటోలు తీస్తూ, వెనకకు అడుగు వేయడంతో స్టేజ్ కు ముందు భాగంలో ఉన్న గుంతలో ఇంటెలిజెన్స్ బ్యూరోలో డీఎస్పీగా పనిచేస్తున్న కుమార్ అమ్మిరేష్ పడిపోయారు. స్టేజ్ కు ముందు గుంత ఉన్న విషయాన్ని ఆయన గమనించలేదు.
వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది తీవ్రంగ గాయపడిన ఆయనను స్థానికంగా ఉన్న మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. అయినప్పటికీ ఆయన తలకు తీవ్ర గాయం కావడంతో, తీవ్ర రక్తస్రావం జరిగి చికిత్స పొందుతూ మరణించారు. ఇంటెలిజెన్స్ బ్యూరోలో అసిస్టెంట్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ఎస్పి ర్యాంక్ ఆఫీసర్ అయిన కుమార్ అమ్మిరేష్ స్వస్థలం బీహార్ రాష్ట్రంలోని పాట్నాగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి జూబ్లీహిల్స్ లోని ఇంటెలిజెన్స్ బ్యూరో క్వార్టర్లో నివాసం ఉంటున్నారు. ప్రమాద ఘటనలో అమ్మిరేష్ మృతి చెందటంతో ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది. ఇక ఆయన మృతి పట్ల పోలీస్ అధికారులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మాదాపూర్ శిల్పకళావేదిక స్టేజ్ నుండి పడిపోయి ఐబీ డీఎస్పీ మృతి; హైదరాబాద్ లో విషాదం #Madhapur, #shilpakalavedika #IBDSPKumarAmmiresh #hyderabad pic.twitter.com/vEg78apvhh
— oneindiatelugu (@oneindiatelugu) May 19, 2022