గవర్నర్ వద్దకు ఓట్ల పంచాయితీ .. అనుమానాలు ఉన్నాయని ఫిర్యాదు చేసిన వైసీపీ, బీజేపీ
హైదరాబాద్ : ఏపీని షేక్ చేస్తోన్న ఓట్ల పంచాయితీ గవర్నర్ వద్దకు చేరింది. ఐటీ గ్రిడ్, బ్లూ క్రాస్ డేటా చోరీ అంశాలను వైసీపీ, బీజేపీ నేతలు గవర్నర్ నరసింహన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసు విచారణ వేగంగా జరిపి .. చర్యలు తీసుకోవాలని విన్నవించారు.
ఆలోచించండి .. అధ్యయనం చేయండి .. తర్వాతే నిర్ణయం తీసుకొండి. అమెరికాలో విద్య కోసం తొందరపడకండి
రాజ్ భవన్ కు చేరిన ఓట్ల పంచాయితీ ...
ఐటీ గ్రిడ్ డేటా చోరీ అంశం తెలుగు రాష్ట్రాల్లో హీట్ పుట్టిస్తోంది. ఈ డేటాతో అధికార తెలుగుదేశం పార్టీ అక్రమాలకు పాల్పడిందని వైసీపీ ఆరోపించింది. ప్రభుత్వం వద్ద ఉండాల్సిన సమాచారం ప్రైవేట్ వ్యక్తుల వద్ద ఎలా ఉంటుందని ప్రశ్నలవర్షం కురిపించింది. బ్లూ క్రాస్ డేటాపై కూడా సందేహాలు వ్యక్తం చేసింది. దీంతోపాటు ఓట్ల తొలగింపు అక్రమాలను ప్రస్తావించారు వైసీపీ అధినేత జగన్. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ఈ క్రమంలో గవర్నర్ ను కలిశారు.
చర్యలు తీసుకొండి
డేటా చోరీ, ఓట్ల తొలగింపు అక్రమాలపై గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేశారు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్. పార్టీ నేతలతో కలిసి సాయంత్రం 4.45 గంటలకు రాజ్భవన్లో గవర్నర్ ను కలిశారు. డేటా చోరీ కేసు విచారణను వేగవంతం చేయాలని ఈ సందర్బంగా గవర్నర్కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఒక వినతిపత్రం కూడా అందజేశారు. గవర్నర్ను కలిసినవారిలో వైసీపీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పిల్లి సుభాష్ చంద్రబోస్, కొలుసు పార్థసారధి, రాజన్న దొర ఉన్నారు.
రాజ్ భవన్ కు బీజేపీ నేతలు
ఐటీ గ్రిడ్, ఓట్ల తొలగింపు అంశంతో నేతలు రాజ్ భవన్ కు క్యూ కడుతున్నారు. మొదట వైసీపీ అధినేత జగన్ రాగా .. తర్వాత బీజేపీ నేతలు గవర్నర్ నరసింహన్ తో భేటీ అయ్యారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలను వివరించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కేసు దర్యాప్తు వేగంగా జరిగేలా చూడాలని విన్నవించారు. అందుకు గవర్నర్ సానుకూలంగా స్పందించారని ఏపీ బీజేపీ నేతలు తెలిపారు.
వాట్ నెక్ట్స్ ..?
ఐటీ గ్రిడ్ తో కదిలిన డేటా చోరీ డొంక .. బ్లూ క్రాస్, ఓట్ల తొలగింపు అంశాలతో ఏపీలో కాక రేపుతోంది. విపక్షాలన్నీ అధికార టీడీపీపై దాడి చేస్తుంటే .. ఏపీ ప్రభుత్వం మాత్రం తోసిపుచ్చుతోంది. ఈ క్రమంలో ఈ ఇష్యూ గవర్నర్ వద్దకి చేరడంతో ఆయన ఎలాంటి ఆదేశాలిస్తారనే చర్చ జరుగుతోంది.