బయోడైవర్సిటీ కారు డ్రైవర్ గుర్తింపు, జరిమానా, మహిళ మృతిపై మరో కేసు
బయో డైవర్సిటీ ప్లై ఓవర్పై ప్రమాదానికి గురైన కారు డ్రైవర్ను పోలీసులు గుర్తించారు. కల్వకుంట్ల కృష్ణమీనన్ రావు అని పేర్కొన్నారు. అతనికి ఇటీవలే నిశ్చితార్థం అయిందని.. జాలీగా తిరుగుతుంటాడని పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో కారు స్పీడ్గా వెళ్లినట్టు స్పీడ్ గన్ ద్వారా పోలీసులు వివరాలు సేకరించారు. అతని కారు నెంబర్ టీఎస్ 09ఈడబ్ల్యూ 5665 అని పోలీసులు పేర్కొన్నారు.
ఇదీ నేపథ్యం..
కల్వకుంట్ల కృష్ణమీనన్ రావు ఎంపవర్ ల్యాబ్స్ అండ్ ఏఆర్ గేమ్స్ వ్యవస్థాపకులు అని పోలీసులు తెలిపారు. ఇతను విలాసవంత జీవితానికి అలవాటు పడ్డారు. లేట్ నైట్ పార్టీలతో సరదాగా గడుపుతుండే వాడని పోలీసులు చెప్పారు. కారు ప్రమాదానికి గురైన ఎయిర్ బ్యాగ్ తెరుచుకోవడంతో... కల్వకుంట్ల కృష్ణమీనన్ రావు ప్రాణాలతో బయటపడ్డారు. స్వల్ప గాయాలకు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
జరిమానా.. కేసు కూడా
కల్వకుంట్ల కృష్ణమీనన్ రావుకు రూ.వెయ్యి రూపాయల జరిమానా విధించినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు ట్రాఫిక్ వెబ్సైట్లో పొందుపరిచారు. అయితే ప్రమాదంతో ఓ మహిళ చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి పోలీసులు మరో కేసు నమోదు చేశారు. హత్యాయత్నం కింద కల్వకుంట్ల కృష్ణమీనన్ రావును అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగానే అరెస్ట్ చేసే చాన్స్ ఉంది.
ఆటో కోసం చూస్తుండగా..
శనివారం ఆటో కోసం ఓ మహిళ ఎదురుచూస్తుంది. ఇంతలో ఫ్లై ఓవర్పై నుంచి మృత్యువు కారు రూపంలో వచ్చింది. వేగంగా దూసుకొచ్చిన కారు ఆమెపై పడింది. మహిళ ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురు గాయపడ్డారు. మృతురాలి కుటుంబానికి ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థికసాయం చేస్తామని ప్రకటించింది. క్షతగాత్రులకు వైద్యం అందిస్తామని తెలిపింది.
వారంలో మూడో ప్రమాదం
ఫ్లై ఓవర్ ప్రారంభించిన వారం రోజుల్లోనే మూడో ప్రమాదం జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఫ్లై ఓవర్ మీద ప్రమాదకర మలుపులు ఉన్నాయని స్థానికులు చెప్తున్నారు. అందువల్లే ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. మరోవైపు ఫ్లై ఓవర్ మీద వేగాన్ని నియంత్రించేందుకు మూడురోజుల పాటు రాకపోకలు నిలిపివేస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు.