టీఆర్ఎస్పై కాదు... మోదీపై చార్జ్షీట్ వేయాలి... అవకాశమిస్తే హైదరాబాద్ను అమ్మేస్తారు...
బీజేపీ దేశాన్ని అమ్మేస్తోందని... అన్నింటినీ ప్రైవేట్పరం చేయడమే బీజేపీ పాలసీ అని మంత్రి కేటీఆర్ విమర్శించారు. రైల్వే రంగాన్ని ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారని ప్రశ్నించారు. బీజేపీకి అవకాశం ఇస్తే హైదరాబాద్ను కూడా అమ్మేస్తారని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధి చేసే నాయకులనే ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయని హామీలని పేర్కొంటూ ఇటీవల బీజేపీ విడుదల చేసిన ఛార్జ్షీట్పై మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఆ పార్టీకి మంత్రి 50 ప్రశ్నలు సంధించారు.
టీఆర్ఎస్, ఎంఐఎం ఒకే నాణేనికి రెండు ముఖాలు, ఓవైసీ బ్రదర్స్ వల్లే రోహింగ్యాలు: తేజస్వి సూర్య
అవన్నీ ఇస్తున్నందుకే చార్జ్షీటా...
' దేశంలో ఎక్కడాలేని విధంగా 24 గంటల విద్యుత్ అందిస్తున్నందుకు టీఆర్ఎస్ ప్రభుత్వంపై చార్జ్షీట్ విడుదల చేశారా... పేకాట క్లబ్బులు మూసివేయించినందుకు ఛార్జిషీట్ విడుదల చేశారా...? ఇంటింటికి మంచి నీళ్లు, వేలాది గురుకులాలతో పేద విద్యార్థులను చదివిస్తున్నందుకు ఛార్జిషీట్ విడుదల చేశారా.. ' అని కేటీఆర్ బీజేపీని ప్రశ్నించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో రైతుబంధు అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. తెలంగాణ నెంబర్ వన్ రాష్ట్రమని గతంలో కేంద్రమంత్రులే చెప్పారని గుర్తుచేశారు.
మోదీపై చార్జ్షీట్ వేయాలి...
రాష్ట్ర విభజన జరిగిన కొద్దిరోజులకే లోయర్ సీలేరు ప్రాజెక్టును తీసుకెళ్లి ఏపీలో కలిపింది బీజేపీ కాదా అని కేటీఆర్ ప్రశ్నించారు. కరోనా సమయంలో చనిపోయిన వలస కార్మికుల ఆత్మలు బీజేపీపై ఛార్జ్షీట్ వేయాలన్నారు. లక్షలాది మంది చిరు వ్యాపారుల పొట్టగొట్టినందుకు వారిపై ఛార్జ్షీట్ వేయాలన్నారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెడుతున్నందుకు బీజేపీపై రైతులు చార్జ్షీట్ వేయాలన్నారు. ఆరేళ్లలో 12కోట్ల ఉద్యోగాలు ఇవ్వనందుకు ప్రధాని మోదీపై ఛార్జ్షీట్ వేయాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ దేశ భవిష్యత్తు కోసమా.. గుజరాత్ పెద్దల కోసమా అని నిలదీశారు.
Recommended Video
ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం...
హైదరాబాద్ ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసిందెవరని బీజేపీని ప్రశ్నించారు. గడిచిన ఆరేళ్లలో హైదరాబాద్కు బీజేపీ ఏం చేసిందో చెప్పగలరా అని నిలదీశారు. అడ్డికి పావుషేరు లెక్కన వేల కోట్ల ఆదాయాన్ని సమకూర్చే ప్రభుత్వ రంగ సంస్థలను బీజేపీ తెగనమ్ముతోందని ఆరోపించారు. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రైల్వే నెట్వర్క్ అయిన ఇండియన్ రైల్వేను ప్రైవేటుపరం చేస్తోంది మీరు కాదా అని ప్రశ్నించారు. 40కోట్ల పాలసీదారులను కలిగిన ప్రపంచంలోనే అతిపెద్ద భీమా కంపెనీ ఎల్ఐసీని తెగనమ్మేందుకు ప్రయత్నిస్తున్నది బీజేపీ కాదా అని నిలదీశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈసారి కూడా విజయం తమదేనని... రెండో స్థానంలో మజ్లిస్ ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.