పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తాం,పాకిస్తానీలను తరిమి తరిమి కొడుతాం..బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ చీఫ్ బండి సంజయ్ తన మాటలతో మంటలు పుట్టిస్తున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీని,ఎంఐఎంను దూకుడుగా టార్గెట్ చేస్తున్న ఆయన... ఈసారి పాతబస్తీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పాతబస్తీలో రోహింగ్యాలు,పాకిస్తానీలు,ఆఫ్ఘనిస్తాన్ వాసులు ఓట్లు వేస్తున్నారని ఆరోపించారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ గెలవగానే పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామన్నారు. రోహింగ్యాలు, పాకిస్తాన్ వాసులను తరిమి తరిమి కొడతామని హెచ్చరించారు. రోహింగ్యాలు,పాకిస్తానీలు,ఆఫ్ఘనిస్తాన్ వాసులు ఓట్లు వేయని ఎన్నికలు జరగాలంటే... అది బీజేపీతోనే సాధ్యమన్నారు. పాతబస్తీలో రోహింగ్యాలు ఉంటే కేంద్ర హోంమంత్రి ఏం చేస్తున్నారని హైదరాబాద్ ఎంపీ,ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ వేసిన ప్రశ్నకు సంజయ్ ఇలా కౌంటర్ ఇచ్చారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హబ్సిగూడ రోడ్ షోలో ఆయన ప్రసంగించారు.
సోమవారం పాతబస్తీలో జరిగిన ఎన్నికల ప్రచారంలో అసదుద్దీన్ ఓవైసీ కేంద్రాన్ని టార్గెట్ చేశారు.ఓటర్ల జాబితాలో కనీసం 30వేల నుంచి 40వేల మంది రోహింగ్యాలు ఉన్నారని కేంద్రంలో ఉన్న అధికార పార్టీ ఆరోపిస్తోందన్నారు. అదే నిజమైతే...ఓటర్ల జాబితాలో 1,000 మంది రోహింగ్యాల పేర్లు చూపించాలని బీజేపీకి సవాల్ విసిరారు. పాతబస్తీలో అన్ని వేల మంది రోహింగ్యాలు ఉంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు. అంతమంది ఓటర్ల జాబితాలో ఎలా ఉన్నారో చూడాల్సిన బాధ్యత ఆయనకు లేదా అని నిలదీశారు. బీజేపీకి నిజంగా నిజాయితీ ఉంటే 1000 మంది రోహింగ్యాల పేర్లను బయటపెట్టాలని అసదుద్దీన్ సవాల్ చేశారు. విద్వేషం సృష్టించడమే బీజేపీ ఉద్దేశమని ఆరోపించారు.
మరోవైపు బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు కూడా ఎంఐఎంపై విరుచుకుపడ్డారు. ఒకప్పుడు హైదరాబాద్ను సౌత్ పాకిస్తాన్లో కలపాలని డిమాండ్ చేసిన చరిత్ర ఎంఐఎం పార్టీకి ఉందన్నారు.ఆ చరిత్రను బీజేపీ,దేశ ప్రజలు ఎన్నటికీ మరిచిపోరన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఎంఐఎం గెలుపుకు టీఆర్ఎస్ సహకరిస్తోందన్నారు. బిహార్ ఎన్నికల్లో గెలిచిన ఓ ఎంఐఎం ఎమ్మెల్యే.. హిందుస్తాన్ పేరుతో ప్రమాణ స్వీకారం చేయనన్నారని పేర్కొన్నారు. ఒకవేళ ఆ పార్టీ 500 ఎమ్మెల్యేలను గెలిపించుకుంటే ఇక దేశంలో హిందూస్తాన్ అన్న పదమే లేకుండా చేస్తారన్నారు.
Recommended Video
టీఆర్ఎస్ పార్టీని రాష్ట్ర ప్రజలు విశ్వసించే స్థితిలో లేరన్నారు. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత నెలకొందన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ సునామీ సృష్టించబోతుందన్నారు. టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోను ఆయన చెత్త బుట్టలో పడేశారు. అందులో కొత్తగా ఇచ్చిన హామీలు గానీ,వ్యూహాత్మక అభివృద్ది ప్రణాళికలు గానీ ఏవీ లేవన్నారు. ఎల్ఐసీ వంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తున్నారని టీఆర్ఎస్ ఆరోపణలను మురళీధర్ రావు కొట్టిపారేశారు.