బల్దియా నగారా మోగనుందా..? గులాబీ దళపతి మదిలో ఏముంది ?
హైదరాబాద్ : రాష్ట్రంలో అన్ని ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఇక గులాబీ దళపతి ఫోకస్ బల్దియా పడింది. అయితే జీహెచ్ఎంసీ కాల పరిమితి 2021 వరకు ఉంది. కానీ అసెంబ్లీ మాదిరిగానే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో ఉన్నారు. అసెంబ్లీలో అదరించినట్టుగానే బల్దియాలోనూ తమవైపే ప్రజలు మొగ్గుచూపుతారని టీఆర్ఎస్ బాస్ భావిస్తున్నారు.
Recommended Video
ఇటీవల నిర్వహించిన టీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో బల్దియా ఎన్నికలపై సంకేతాలిచ్చారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. దీంతో గ్రేటర్ ఎన్నికల చర్చ మొదలైంది. అంతేకాదు బల్దియా ఎన్నికల కోసం గులాబీ నేతలు సిద్ధమవుతున్నారు. కార్పొరేటర్లతోనూ ఇంటర్నల్గా సమావేశమవుతున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బల్దియాకు ముందస్తు ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం ఆ పార్టీ వర్గాల్లో సాగుతుంది.
కొత్త మున్సిపల్ చట్టంలో భాగంగా నగర శివారు ప్రాంతాల్లోని ఆరు మున్సిపాలిటీలను కార్పొరేషన్లుగా మార్చారు. అయితే వాటిని కూడా బల్దియాలో విలీనం చేస్తే బాగుంటుందనే చర్చ టీఆర్ఎస్లో జరుగుతుంది. కొత్త కార్పొరేషన్లు బల్దియాలో విలీనమైతే త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల నుంచి వాటిని మినహాయించే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వానికి మరో ఇబ్బంది కూడా ఉంది. గ్రేటర్ ఎన్నికలను ఆలస్యం చేస్తే ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందనే చర్చ కూడా టీఆర్ఎస్ పార్టీలో జోరుగా సాగుతుంది. దీంతోపాటు కొన్నిచోట్ల కార్పొరేటర్లపై వ్యతిరేకత ఉన్నట్టు హైకమాండ్ దృస్టికి వచ్చింది. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగినట్టు విశ్వసనీయంగా తెలిసింది.