టీపీసీసీ చీఫ్ గా అవకాశం ఇస్తే చచ్చే దాకా కాంగ్రెస్ లోనే ఉంటా ... వీహెచ్
తెలంగాణా కాంగ్రెస్ లో టీపీసీసీపదవిపై ఉత్కంఠ వీడటం లేదు. నేనంటే నేను అర్హుడను అని ఎవరికి వారు టీపీసీసీ రేసులో తలపడుతున్నారు . ఇక తాజాగా బీసీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు వీ. హనుమంతరావు టీపీసీసీపదవి తనకు ఇవ్వాలని అధిష్టానాన్ని కోరారు.
కేసీఆర్ హటావో, తెలంగాణ బచావో.. అప్పులకుప్పగా రాష్ట్రం, 30 నుంచి కార్యాచరణ: వీహెచ్
కాంగ్రెస్ కు విధేయుడను ..టీపీసీసీ పదవి ఇవ్వాలని వీహెచ్ విజ్ఞప్తి
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ. హనుమంత రావు గాంధీభవన్లో విలేఖరులతో మాట్లాడారు. ఆయన వీహెచ్ అనే నేను కాంగ్రెస్కు విధేయుడినని, చచ్చేదాకా కాంగ్రెస్ను వీడనని అన్నారు. అయితే బీసీ వర్గానికి చెందిన నేతగా తనకు పీసీసీ పదవి ఇచ్చి అవకాశం కల్పించాలని హైకమాండ్ను కోరారు. అయితే సీఎం పదవి ఎవరికి ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని, పీసీసీ పదవికి వయస్సుతో పనిలేదని తనకు ప్రజలలో మంచి ఇమేజ్ ఉందని ,అందులోనూ చాలా సీనియర్ నేతనని చెప్పుకొచ్చారు.
పదవి ఇస్తే కాంగ్రెస్ ను అధికారంలోకి తప్పకుండా తీసుకొస్తా అన్న వీహెచ్
పార్టీ కోసం గతంలో చేసిన పనులను గుర్తు చేశారు. తాను ఆనాడు ఎన్టీ రామారావుకు వ్యతిరేకంగా యాత్ర చేశానని అప్పట్లో సోనియా గాంధీ తనను అభినందించారని అన్నారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీల విధానాలు, మాటలే తనకు శిరోధార్యమని తాను పార్టీకి విదేయుడను అని ఆయన పేర్కొన్నారు. డీఎస్ హయాంలో రెండు సార్లు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని చెప్పిన వీహెచ్, ఈ సారైనా బీసీలకు అవకాశం కల్పిస్తే కాంగ్రెస్ను తప్పకుండా అధికారంలోకి తీసుకువస్తానని చెప్పుకొచ్చారు. ఆ అవకాశం తనకు ఇవ్వాలని కోరారు.
బీసీ నాయకులలో సీనియర్ వీహెచ్ కూడా ఉన్నారని జగ్గా రెడ్డి వ్యాఖ్యలు
ఇక ఇదే సమయంలో తెలంగాణ రాజకీయాల్లో వివాదాస్పద సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా ఇటీవల టీపిసిసి అధ్యక్ష పదవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారం రోజుల క్రితం టీపీసీసీ చీఫ్ అధ్యక్ష పదవికి తనకు అర్హత ఉన్నట్లుగా ప్రకటించుకున్న జగ్గారెడ్డి తన బయోడేటాను కూడా పంపించినట్టుగా తెలిపారు. ఇక తాజాగా టీపిసిసి పదవికి పార్టీలో అన్ని వర్గాల వారికి హక్కుందని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. రెడ్లు బ్రాహ్మణులే కాదు బీసీలలోనూ సమర్థవంతంగా పనిచేసేవారని ఆయన పేర్కొన్నారు. బీసీలలో సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు ఉన్నారని జగ్గారెడ్డి అన్నారు.
పీసీసీ రేసులో పోటాపోటీగా సీనియర్లు .. అధిష్టానం ఏం చేస్తుందో ?
తెలంగాణలో పీసీసీ చీఫ్ మార్పుపై గత కొన్ని రోజులుగా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో సొంత నియోజకవర్గంలో భార్య పద్మావతిని గెలిపించుకోలేకపోయారని, అందుకే ఖచ్చితంగా పీసీసీ చీఫ్ను మారుస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలు ఎవరికి వారుగా తామే పీసీసీ ప్రెసిడెంట్ అని ప్రకటనలు చేస్తున్నారు. తమకు అవకాశం ఇవ్వాలని అధిష్టానం వద్ద పోటీ పడుతున్నారు.