ఐఐటీ-హైదరాబాద్ లో విషాదం: విద్యార్థి ఆత్మహత్య.. క్యాంపస్ లోనే ఘటన..!
సంగారెడ్డి: ఐఐటీ-హైదరాబాద్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతం ఇది. సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ క్యాంపస్ లో మంగళవారం తెల్లవారు జామున ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడి పేరు సిద్ధార్థ్ పిచ్చికల. ఐఐటీ-హైదరాబాద్ లో మూడో సంవత్సరం విద్యార్థి. కంప్యూటర్ సైన్స్ లో ఇంజినీరింగ్ చేస్తున్నాడు. హైదరాబాద్ కు చెందిన సిద్ధార్థ్ ఐఐటీ క్యాంపస్ లోని హాస్టల్ లో ఉంటున్నాడు. కారణాలేమిటో తెలియరావట్లేదు గానీ.. ఈ తెల్లవారు జామున తాను ఉంటోన్న హాస్టల్ మూడో అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
రణమా..శరణమా: ఇక బంతి శివసేన కోర్టులో: నో 50-50 ఫార్ములా..ఇక మీ ఇష్టం: బాంబు పేల్చిన దేవేంద్ర..!
దీన్ని గమనించిన వెంటనే తోటి విద్యార్థులు హాస్టల్ సిబ్బందికి తెలియజేశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సిద్ధార్థ్ మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్ కోసం సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. సిద్ధార్థ్ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలపై అన్వేషిస్తున్నామని పోలీసులు తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సిద్ధార్థ్ ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన విద్యార్థి కావడం వల్ల ఆర్థిక పరమౌన ఇబ్బందులు లేవని పోలీసులు ప్రాథమికంగా చెబుతున్నారు.
చదువులో వెనుకబడటం వల్లే ఆత్మహత్యకు పురిగొల్పి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఆత్మహత్య చేసుకోవడానికి కొన్ని గంటల ముందు సిద్ధార్థ్ తన స్నేహితులకు ఇమెయిల్ పంపించాడని వెల్లడించారు. ఇమెయిల్ లో ఉన్న సారాంశమేమిటనేది ఇంకా తెలుసుకోవాల్సి ఉందని, దాన్ని స్వీకరించిన అతని స్నేహితులను విచారిస్తామని అంటున్నారు. ఆశించిన స్థాయిలో చదువులో రాణించలేకపోవడం వల్ల మానసిక ఒత్తిళ్లకు గురై, ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. సిద్ధార్థ్ ఆత్మహత్యకు గల సమగ్ర కారణాలపై దర్యాప్తు సాగుతోందని పోలీసులు చెప్పారు.