మంత్రులు కేటీఆర్ హరీష్రావులకు ఐటీ శాఖ షాక్.. రేవంత్ రెడ్డి ఫిర్యాదుతో..!
హైదరాబాద్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర మంత్రి కేటీఆర్, మరో మంత్రి హరీష్రావులకు ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) నోటీసులు ఇచ్చింది. వీరితో పాటు పలువురు టీఆర్ఎస్ ఎంపీలకు కూడా ఐటీ నోటీసులు వచ్చాయి. 2017 ఏప్రిల్ 27న వరంగల్లో భారీ స్థాయిలో జరిగిన ప్రగతి నివేదన సభ ఈ నోటీసులకు కారణమైనట్లు తెలుస్తోంది.
విరాళాల సేకరణ
బహిరంగ సభల పేరుతో టీఆర్ఎస్ నాయకులు అధికార దుర్వినియోగంకు పాల్పడ్డారంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిండెంట్ మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐటీ శాఖ మంత్రులతో పాటు పలువురు ఎంపీలకు నోటీసులు జారీ చేసింది. ఈ భారీ సభల నిర్వహణకు పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు విరాళాలు సేకరించారు. ఇందుకోసం కరపత్రాలు కూడా పంచారు. విరాళాల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారని రేవంత్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. ఆ సమయంలో చాలామంది మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూలీ పని, జ్యూస్లు చేయడం, కూరగాయలు అమ్మడం వంటివి చేసి డబ్బులు సేకరించారు .
ఐస్ క్రీములు అమ్మి రూ.7 లక్షలు సేకరించిన కేటీఆర్
గులాబీ కూలీ కార్యక్రమంలో భాగంగా మంత్రి కేటీఆర్ ఐస్క్రీంలు అమ్మి రూ.7 లక్షలు సేకరించగా.. ఈ ఐస్ క్రీమ్లను మల్లారెడ్డి కొనుగోలు చేశారు. ఇక అప్పటి హోంశాఖ మంత్రిగా ఉన్న నాయిని నరసింహారెడ్డి ఓ బట్టల షోరూంలో పనిచేసి రూ.20లక్షలు సేకరించారు. బావర్చీలో పనిచేయడం ద్వారా రూ.50వేలు సేకరించగా, పిస్తా హౌజ్లో పని చేసి రూ. 50వేలు సేకరించారు. అయితే వారు చేసిన పనికి వారు సంపాదించిన డబ్బులకు ఎక్కడా పొంతన కుదరడం లేదని తన ఫిర్యాదులో రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కూలీ మనుషులుగా పనిచేసిన టీఆర్ఎస్ మంత్రులు కొన్ని లక్షల్లో డబ్బులు సంపాదించారని రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు.
రాజకీయ పార్టీకి ప్రజాప్రతినిధులు ఎలా నిధులు సేకరిస్తారు..?
ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న ప్రజాప్రతినిధులు ప్రభుత్వం నుంచి వేతనం పొందుతూ ఒక రాజకీయ పార్టీకి నిధులు ఎలా సేకరిస్తారని ఆయన ప్రశ్నించారు. ఇక నోటీసులు జారీ చేసిన మంత్రుల్లో ఈటల రాజేందర్, డిప్యూటీ సీఎం మహ్మూద్ అలీలు కూడా ఉన్నారు. రవాణా చార్జీలు, టీఆర్ఎస్ కార్యకర్తలకు కనీస సదుపాయాలు కల్పించేందుకు గులాబీ కూలీ పేరుతో టీఆర్ఎస్ పార్టీ నిధులు సేకరించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏదో పేరుకు గులాబీ నేతలు మంత్రులు పనిచేశారు తప్పితే వారు చేసిన పనికి అంత డబ్బులు రావని చెప్పారు.
కోర్టులను కూడా ఆశ్రయిస్తాను
ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ -1988 చట్టంను మంత్రులు, ఎమ్మెల్యేలు ఉల్లంఘించారని చెప్పిన రేవంత్ రెడ్డి, ఇదే విషయాన్ని ఐటీశాఖ దృష్టికి తీసుకొచ్చినట్లు చెప్పారు.. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ నేతలు ఎమ్మెల్యేలు, మంత్రులు సేకరించిన డబ్బులపై రాజ్యాంగపదవుల్లో ఉన్నవారికి, పలు ప్రభుత్వ ఏజెన్సీలకు ఇతర శాఖల దృష్టికి తీసుకొచ్చినట్లు చెప్పిన రేవంత్ రెడ్డి దీనిపై త్వరలో కోర్టులను కూడా ఆశ్రయిస్తానని చెప్పారు.