వంటగ్యాస్ సిలెండర్ ధరల పెంపు; మహిళలకు మోడీ కానుక అంటూ మంత్రి కేటీఆర్ సెటైర్
హైదరాబాద్: గృహావసరాల కోసం వినియోగించే వంటగ్యాస్ ఎల్పీజీ సిలిండర్ల ధరలు పెంచి చమురు సంస్థలు షాక్ ఇచ్చాయి. సామాన్యులపై ఒక్కో ఎల్పీజీ వంటగ్యాస్ సిలిండర్పై 50 రూపాయల భారాన్ని మోపాయి. అంతేకాదు దీనితో పాటు అయిదు కేజీల సిలిండర్ల ధరలలో కూడా 18 రూపాయల మేర పెరుగుదల కనిపించింది. ఇక వాణిజ్య అవసరాల కోసం వినియోగించే ఎల్పీజీ సిలిండర్ల ధరలను స్వల్పంగా తగ్గించాయి. తాజాగా పెరిగిన వంట గ్యాస్ ధరలతో ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర వెయ్యి రూపాయలు దాటేసింది.
పెరిగిన వంట గ్యాస్ సిలెండర్ ధరలను టార్గెట్ చేసిన మంత్రి కేటీఆర్
పెరిగిన వంట గ్యాస్ ధరల దెబ్బకు సామాన్యులు కేంద్రం తీరుపై తీవ్రఅసహనంతో ఉన్న వేళ ఇదే అదునుగా మంత్రి కేటీఆర్ కేంద్రంపై విరుచుకుపడ్డారు. తాజాగా వంట గ్యాస్ సిలిండర్ల ధర పెంపుపై తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ సెటైర్లు వేశారు. సోషల్ మీడియా వేదికగా వంట గ్యాస్ సిలిండర్ల ధర పెంపుపై స్పందించిన మంత్రి కేటీఆర్ మహిళలకు మోడీ కానుక ఇచ్చారంటూ ఎద్దేవా చేశారు. మంచిరోజులు వచ్చాయి, శుభాకాంక్షలు అంటూ సెటైరికల్ ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్ వెయ్యి రూపాయలు గా ఉన్న గ్యాస్ సిలిండర్ ధరను మరో 50 రూపాయలు పెంచి 1,050 రూపాయలుగా మోడీ ప్రభుత్వం పెంచేసింది అని, మోడీ గారు సిలిండర్ల ధర పెంచి మహిళలకు కానుకగా ఇచ్చారని మంత్రి కేటీఆర్ సెటైర్ వేశారు.
కేంద్ర ప్రభుత్వ విధానాలపై నిప్పులు చెరుగుతున్న మంత్రి కేటీఆర్
దేశీయంగా 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధరలు నేటి నుంచి రూ.50 చొప్పున పెరిగాయని, దేశీయ ఎల్పీజీ సిలిండర్ ధర ఇప్పుడు ఢిల్లీలో రూ.1053గా ఉందని, 5 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.18 పెరిగిందని, 19కేజీల వాణిజ్య సిలిండర్ ధర స్వల్పంగా రూ.8.50 తగ్గిందని ఒ ట్వీట్ ను ఆయన జత చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను తరచు తనదైన శైలిలో ఎండగడుతున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా కేంద్ర బీజేపీ సర్కార్ పై నిత్యం విరుచుకుపడుతున్నారు.
బీజేపీ ద్వంద్వ విధానాలు, అబద్దాలు బట్టబయలు అయ్యాయన్న కేటీఆర్
తాజాగా బిజెపి ద్వంద్వ విధానాలు, అబద్ధాలు బట్టబయలు అయ్యాయని పేర్కొన్న మంత్రి కేటీఆర్ మోడీ సర్కార్ తెలంగాణకు రూ. 2,52,202 కోట్లు ఇచ్చిందని హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారని తెలిపారు. ఇక అదే మోడీ సర్కార్ తెలంగాణకు రూ. 3,18,000 కోట్లు ఇచ్చిందని రాణి రుద్రమ వ్యాఖ్యానించారని, మోడీ సర్కార్ తెలంగాణకు రూ. 3,94,147 కోట్లు ఇచ్చిందని ధర్మపురి అరవింద్ చెప్పారని కేటీఆర్ పేర్కొన్నారు. దీనికి సంబంధించి వారు మాట్లాడిన వీడియో లను పోస్ట్ చేసి మరీ టార్గెట్ చేశారు.
బీజేపీ అజెండా ఇదే అంటూ కేటీఆర్ ఆగ్రహం
అసత్యాలు ప్రచారం చేయడం, వాస్తవాలను తిరస్కరించడం బీజేపీ అజెండా అంటూ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఇక గుజరాత్ లో 35 శాతం అక్రమ కట్టడాలు ఉన్నాయని ఓ వార్తను పోస్ట్ చేసిన కేటీఆర్, బుల్డోజర్ ప్రభుత్వం ఏం చేస్తోంది అంటూ సెటైర్ వేశారు. గుజరాత్ లో అక్రమ కట్టడాల కూల్చివేతలు ఉండవా అంటూ మంత్రి కేటీఆర్ బీజేపీ పాలిత రాష్ట్రంలో పరిస్థితి ఇలా ఉందని టార్గెట్ చేశారు.