నగరంలో పెరిగిపోతున్న వాహనాలు..! అప్రమత్తంగా ఉండకపోతే ప్రమాదమే..!!
హైదరాబాద్ : హైదరాబాద్లో రహదారులు కిటకిటలాడుతున్నాయి. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి. మూడు దశాబ్దాల కిందట నిర్వహించిన అధ్యయన నివేదికలు ప్రభుత్వం వద్ద ఉన్నాయి. అప్పుడు సూచించిన ప్రత్యామ్నాయ మార్గాల్లో ఇప్పటికీ చేయాల్సినవి చాలా ఉన్నాయి. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రహదారులపై రద్దీని నియంత్రించవచ్చు. ప్రజల జీవన గమనంలో వేగం పెరిగింది. సహజంగా వాహనాలూ పెరుగుతాయి. వాహనాల పెరుగుదలపై ఆంక్షలు పెడితే ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు కూడా ప్రత్యామ్నాయాలే అయినప్పటికీ లింకు రహదారులను నిర్మిస్తేనే ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది.
ఆశ్యర్యాన్ని కలిగిస్తున్న వాహనాల పెరుగుదల..! ప్రత్యామ్నాయాలపై ద్రుష్టి..!!
రాష్ట్రంలో వాహనాలు వెల్లువెత్తున్నాయి. గత అయిదేళ్లలో 8.16 రెట్లకు మించి పెరిగాయి. రాష్ట్ర జనాభాలో ప్రతి 5.92 మందికి ఒక వాహనం ఉన్నట్లుగా రవాణాశాఖ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ప్రజల అభిరుచిలో వస్తున్న మార్పుల కారణంగా అత్యాధునిక వాహనాలు రహదారులపైకి చేరుతున్నాయి. కొన్ని రకాల వాహనాల కొనుగోళ్లు తొమ్మిది నుంచి పది రెట్ల వరకు పెరగటం విశేషం. మోపెడ్ల నుంచి రోల్స్ రాయిస్ కార్ల వరకు హైదరాబాద్ రహదారులపై చక్కర్లు కొడుతున్నాయి. వాహనాల పెరుగుదల తీరు అధికారులకు సైతం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కొత్త రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో ప్రభుత్వం పెద్ద సంఖ్యలో వాహనాలు కొనుగోలు చేసింది. ప్రత్యేకించి పోలీసు శాఖకు భారీగా వాహనాలను సమకూర్చింది.
నగరంలో వాహన విస్పోటనం..! సౌకర్యాలు మెరుగుపడాల్సి ఉందంటున్న అదికారులు..!!
ప్రజలు వినియోగించే వ్యక్తిగత వాహనాలు సైతం అనూహ్యంగా పెరుగుతున్నాయి. వాహనాల విస్పోటనంలో రాష్ట్ర ప్రభుత్వ ఖజానా సైతం గలగలలాడుతోంది. రవాణా శాఖ వాహనాల రిజిస్ట్రేషన్ కోసం రూపొందించిన 11 విభాగాల్లోనూ 2014 జూన్ నుంచి 2018 డిసెంబరు వరకు 200 శాతానికి పైగా పెరుగుదల నమోదు కావటం విశేషం. వాహనాలు పెరుగుతున్న స్థాయిలో రహదారుల వెడల్పు పెరగటం లేదు. ఫలితంగా హైదరాబాద్ నగరంలో వాహనాల వేగం గణనీయంగా తగ్గిపోయిందని ట్రాఫిక్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఉబర్, ఓలా సంస్థలు ప్రవేశించటంతో మోటార్ క్యాబులు (ట్యాక్సీ కార్లు) కూడా భారీగా పెరిగాయి. మొత్తం 75.57 లక్షల వాహనాల్లో ద్విచక్ర వాహనాల వాటా 65 శాతంగా ఉండడం గమనార్హం.
విపరీతంగా పెరిగిన ఖజానా...! పన్ను పెంచే యోచనలో రవాణా శాఖ..!!
రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి వాహనాల రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వ ఆదాయం సగటున 20 శాతానికి మించి పెరుగుతోంది. పన్నుల రూపంలో వచ్చే ఆదాయమూ పెరుగుతోంది. రాష్ట్ర విభజన జరిగిన సంవత్సరంలో రవాణాశాఖ ఆదాయం 1,854 కోట్ల రూపాయలుగా ఉంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ ఏడాది జనవరి వరకు 2,950 కోట్ల రూపాయల ఆదాయం లభించటం విశేషం. రానున్న రోజుల్లో ఈ ఆదాయం మరింత పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వాహనాలను నియంత్రించడం కోసం రెండో వాహనం కొనుగోలు చేస్తే 2 శాతం అదనంగా పన్ను చెల్లించాలనే నిబంధన పెట్టినప్పటికీ నియంత్రణ వీలుపడడంలేదు. ఆ పేరుతో రవాణా శాఖలో అవినీతి చోటు చేసుకుంటుండటంతో దానిని ఎత్తివేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీనికి ప్రత్యామ్నాయంగా వాహనాల పన్ను ఒకటి నుంచి రెండు శాతం పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం.
ఖరీదైన కార్ల జోరు...! 75శాతం నగర రోడ్ల మీద తిరగాల్సిందే..!!
రాష్ట్రంలో ఖరీదైన కార్ల సంఖ్య ఇటీవలి కాలంలో భారీగా పెరుగుతోంది. వాహన విపణిలోకి వచ్చిన అత్యంత ఖరీదైన ఎలాంటి వాహనమైనా హైదరాబాద్ రోడ్లపై పరుగులు పెట్టాల్సిందేనని రవాణా శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. 50 లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల విలువ చేసే కార్లు ఏటా 200 నుంచి 300 వరకు పెరుగుతున్నాయి. కోటి రూపాయలు.. అంతకుమించి విలువైన కార్లు ఏటా వందకుపైగా రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. కొన్ని రకాల ద్విచక్రాల వాహనాలు కూడా ఖరీదైనవే రోడ్లపైకి వస్తున్నాయి. ఖరీదైన వాహనాల్లో 75 నుంచి 80 శాతం వరకు హైదరాబాద్ నగరంలోనే రిజిస్టర్ అవుతుండడం విశేషం..!