నగరం పైన చెరగని ముద్ర..! ముఖేష్ గౌడ్ శాశ్వత నిద్ర..! సీఎం కేసీఆర్ సంతాపం..!!
హైదరాబాద్: నగరం పై చెరగని ముద్ర వేసుకున్న సీనియర్ రాజకీయ వేత్త మూల ముఖేష్ గౌడ్ తుది శ్వాస విడిచారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి మూల ముఖేష్ గౌడ్ (60) జూబ్లిహిల్స్ అపోలో హాస్పిటల్ లో తుది శాశ్వత నిద్ర లోకి వెళ్లిపోయారు. గొంతు క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన కొద్ది నెలల నుంచి ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. శరీరం వైద్యానికి సహకరించకపోవడంతో వారం రోజుల క్రితం అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ చేశారు.
కర్నాటక నుంచి తెప్పించిన ఆయుర్వేద మందు అందచేస్తున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో మళ్లీ ఆయనను అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతో చికిత్సను నిలిపివేశారు. చనిపోయారని కుటుంబ సభ్యులకు సోమవారం అధికారికంగా సమాచారం ఇచ్చారు.
మొదటిసాదరి ఎంసీహెచ్ కు కార్పొరేటర్ గా ఎన్నికైన ఆయన తరువాత మహరాజ్ గంజ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత గోషామహల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు. తొలిసారి వైఎస్ఆర్ మంత్రి వర్గంలో మంత్రిగా చేరిన ఆయన కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో కూడా కొనసాగారు.
2014 లో జరిగిన ఎన్నికల్లో గోషామహల్ లో బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ చేతిలో తొలిసారి ఓటమి పాలు కాగా 2018లో మారోసారి ఓటమి పాలయ్యారు. ఆ తరువాత ఆయన ఆరోగ్యం బాగా లేకపోవడంతో చికిత్స కోసం బంజారాహిల్స్ లోని కేర్ ఆసుపత్రిలో చేరారు. కొద్ది నెలలుగా ఆయన గొంతు క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ముఖేష్ గౌడ్ కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వరసకు వియ్యంకుడు కాగా మాజీ హోం మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు టీ. దేవేందర్ గౌడ్ కు స్వయాన మేనల్లుడు.
ఐతే ముఖేష్ గౌడ్ మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ముఖేష్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నానని సీఎం పేర్కొన్నారు. మంత్రిగా, ఎమ్మెల్యేగా ముఖేష్ గౌడ్ చేసిన సేవలను సీఎం స్మరించుకున్నారు. ముఖేష్ గౌడ్ కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు.