ఈసారి ప్రగతి భవన్లోనే పంద్రాగస్ట్ వేడుకలు, వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నిర్ణయం
కరోనా వైరస్ వల్ల స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ప్రగతి భవన్లో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ర్టం ఆవిర్భవించినప్పటీ నుంచి గోల్కొండలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నారు. అయితే కరోనా వైరస్ వ్యాప్తి వల్ల వేడుకల వేదికను మార్చివేశారు. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ ఆగస్ట్ 15న ఉదయం 10.30కి జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. మంత్రులు జిల్లాల్లో జరిగే వేడుకల్లో పాల్గొంటారు.
ఆగస్టు 15వ తేదీన ఏయే జిల్లాల్లో ఎవరు జెండాను ఆవిష్కరించాలనే విషయంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.. స్థానిక ఎమ్మెల్యేలు, మేయర్లు, జడ్పీ చైర్పర్సన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్ పర్సన్లు, మునిసిపల్ చైర్పర్సన్లు, ఇతర జిల్లాస్థాయి అధికారులు జిల్లా స్థాయిలో జరిగే ఉత్సవాల్లో పాల్గొంటారు. ఉదయం 10:30 గంటలకు తమ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించాలని సూచించారు.
మండల స్థాయిలో ఎంపీపీలు, గ్రామస్థాయిలో సర్పంచ్లు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. వేడుకల్లో పాల్గొనే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించడంతోపాటు శానిటైజర్లు ఉపయోగించాలని సీఎస్ స్పష్టంచేశారు.