భారతలో గొప్ప రాజ్యంగ వ్యవస్థ ఉంది..! బీజేపి 300సీట్లు గెలుచుకోవడం గొప్పేమీ కాదన్న అసదుద్దీన్..!!
హైదరాబాద్: సంచలన వ్యాఖ్యలకు మారు పేరైన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ బీజేపి ని టార్టెట్ చేసారు. పనిలో పనిగా ప్రధాని మోదీ విధానాలను కూడా విమర్శించారు. అంతే కాకుండా భారత రాజ్యంగం పట్ల అపార గౌరవాన్ని చూపించారు. ఓ పక్క భారత రాజ్యాంగాన్ని పొగుడుతూనే మరో పక్క బీజేపి విధానాలను ఎండగట్టే ప్రయత్నం చేసారు అసదుద్దీన్ ఒవైసీ. భారత్ లో ఊపిరితో ఉన్న ఒక గొప్ప రాజ్యాంగ వ్యవస్థ ఉందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చిందని ముస్లింలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, దేశంలోని ప్రతి పౌరుడికి మత స్వేచ్ఛను రాజ్యాంగం కల్పించిందని అన్నారు. మోదీ గుహల్లో కూర్చుంటే తాము మసీదుల్లో ప్రార్థనలు చేసుకుంటామని గర్వంగా చెబుదామని అన్నారు. మన దేశంలో 300లకు పైగా సీట్లను సాధించడం గొప్ప విషయమేమీ కాదని తెలిపారు. 300 సీట్లు సాధించిన బీజేపీ మన హక్కులను కాలరాయలేదని అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు.
మనం మన మతాన్ని ఆచరించే స్వేచ్ఛను భారతీయ చట్టాలు, రాజ్యాంగం ఇచ్చాయని అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. భారత్ లో మనం కిరాయిదారులం కాదని, అందరితో సమానంగా, గౌరవంగా బతికే హక్కు మనకు ఉందని చెప్పారు. భారత్ ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలని, మనమంతా మన దేశాన్ని ప్రశాంతంగా ఉంచేందుకు కృషి చేద్దామని తెలిపారు. శ్రీలంకలో చోటుచేసుకున్న ఉగ్రదాడులపై స్పందిస్తూ... ఇస్లాంలో హింసకు తావు లేదని తెలిపారు. ప్రార్థనా స్థలాల్లో, ఇతర ప్రాంతాల్లో బాంబు పేలుళ్లకు పాల్పడి, 40 మంది అమాయక చిన్నారులతో సహా 200 మందికి పైగా ప్రాణాలను బలికొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి ఇస్లాం గురించి మీరు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. హంతకులు ఇస్లాంను కాకుండా సైతాను బోధనలను అనుసరిస్తున్నారని అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు.