కరోనా లక్షణాలు లేనివారితో బలహీనులకు ప్రమాదమే: హైదరాబాద్లో డీ614జీ వైరస్ అనుమానాలు
న్యూఢిల్లీ/హైదరాబాద్: కరోనా వైరస్ లక్షణాలు కనిపించని రోగుల్లో వైరస్ లోడ్ ఏవిధంగా ఉంటుందనే విషయంపై హైదరాబాద్లోని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్(సీడీఎఫ్డీ) శాస్త్రవేత్తలు పరిశోధనలు నిర్వహించారు. 200 మంది వైరస్ సోకినవారిలో జరిపిన ఈ పరిశోధనలో సంచలన విషయాలు వెలుగుచూసినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.
కరోనా లక్షణాలు లేనివారితో బలహీనులకు ప్రమాదమే..
ముఖ్యంగా కరోనావైరస్ లక్షణాలు లేని రోగుల్లో వైరల్ లోడ్ ఎక్కువగానే ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను పర్యవేక్షించడంతోపాటు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాల్సిన ఆవశ్యకత తాజా పరిశోధనల ఫలితాల ద్వారా వెల్లడైంది. ముఖ్యంగా లక్షణాలు లేనివారి నుంచి తక్కువ రోగనిరోధక శక్తి ఉన్నవారికి వైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉందని, అలాంటి సమయంలోవారు తీవ్ర అనారోగ్యానికి గురి అవుతారని.. ఒక్కోసారి మరణానికి కూడా దారితీస్తుందని సీడీఎఫ్డీకి చెందిన పరిశోధకులు మురళీధరన్ భాష్యం వెల్లడించారు. అందుకే లక్షణాలు కనిపించనివారిని కూడా పరిగణలోకి తీసుకోవాని సూచించారు.
లక్షణాలు కనిపించని రోగుల్లోనే వైరల్ లోడ్ ఎక్కువ..
తెలంగాణ ప్రాంతంలో వ్యాపిస్తోన్న వైరస్ వంశాలను గుర్తించడమే లక్ష్యంగా ఈ పరిశోధన చేపట్టామన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో వైరస్ సంక్రమణ, వాటి జన్యుక్రమాలను గుర్తించడం ఎంతో కీలకమని అభిప్రాయపడ్డారు. అయితే, కరోనా లక్షణాలు కనిపించని రోగుల్లో వైరల్ లోడ్ ఎక్కువగా ఉండటం అనేది ఆశ్చర్యం కలిగించే విషయమేనని ఢిల్లీలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీకి చెందిన నిపుణులు సత్యజిత్ రాత్ వ్యాఖ్యానించారు. దీనిపై మరింత అధ్యయనం జరగాల్సి ఉందన్నారు.
డీ614జీ రకం వైరస్ అనుమానాలు
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 210 మంది రోగుల నమూనాలను సేకరించి వారి జన్యుక్రమ సమాచారాన్ని విశ్లేషించారు. దీనిలో భాగంగా వైరస్ జన్యువులో తరచూ ఉత్పరివర్తనాలు జరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. నమూనాలు సేకరించిన రోగుల్లో దాదాపు 95 శాతం 20బీ స్టెయిన్ వైరస్ ఉండగా, మిగితావి వేరే రకాలకుచెందిన వైరస్లుగా తేల్చారు. ఈ ప్రాంతంలోనే వైరస్ వ్యాప్తి జరగడానికి అతి ఎక్కువ ప్రాబల్యం కలిగిన డీ614జీ రకం వైరస్ కారణమనే అనుమానాన్ని కూడా శాస్త్రవేత్తలు వ్యక్తం చేశారు. కాగా, తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ నరగంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న విషయం తెలిసిందే.