మనుషుల అక్రమ రవాణాకు బ్రేక్..! అంతర్జాతీయ ముఠా గుట్టురట్టు (వీడియో)
హైదరాబాద్ : మనుషుల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టైంది. నకిలీ వీసాలు, పాసుపోర్టులతో మనుషులను విదేశాలకు తరలిస్తున్న అంతర్జాతీయ ముఠాను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. విదేశాల్లో ఉద్యోగాల పేరిట అమాయక ప్రజలను టార్గెట్ చేస్తూ ఈ ముఠా సభ్యులు మనుషుల అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని తెలిపారు సైబరాబాద్ సీపీ సజ్జనార్. 18 మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించామన్నారు.
న్యూజిలాండ్ మసీదులపై దాడి : సోషల్ మీడియా ట్వీట్పై ట్రంప్ ఫైర్
నిందితుల నుంచి 250 నకిలీ పాస్పోర్ట్లు, వీసాలు, 38 సెల్ ఫోన్లు 160 పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్స్, 6 కంప్యూటర్లు, 5 ల్యాప్ టాపులు, రెండు ప్రింటర్లతో పాటు కొంత నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి ఫేక్ ముఠాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు సీపీ. మనుషుల అక్రమ రవాణాకు సంబంధించి ఇప్పటివరకు 14 కేసులు నమోదు చేసి 71 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మరో 21 మంది పరారీలో ఉన్నట్లు చెప్పారు.
దేశమంతటా ఇలాంటి ముఠాలు రెచ్చిపోతున్నాయన్నారు సీపీ. నకిలీ వీసాల దందా యదేచ్ఛగా నడుస్తోందని.. ముంబైలోని రిజిస్టర్డ్ ఏజెంటుతో తాజాగా దొరికిన ముఠాకు లింకులున్నట్లు తెలిపారు. చేవెళ్ల ప్రాంతం నుంచి పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్లు ఇప్పించారని.. ఓ కానిస్టేబుల్ ఈ ముఠా సభ్యులకు సహకరించారని ధృవీకరించారు.