హైదరాబాద్ కేంద్రంగా అంతర్జాతీయ మానవ అక్రమరవాణా ముఠా... 17 మంది అరెస్ట్
తెలంగాణ రాష్ట్రంలో మానవ అక్రమ రవాణా యధేచ్చగా సాగుతోంది. హైదరాబాద్ నుండి ఇతర దేశాలకు నకిలీ వీసాలతో పెద్ద ఎత్తున మానవ అక్రమ రవాణా దందా జరుగుతోంది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో తరచూ నకిలీ వీసాల తో పట్టుబడుతున్న ప్రయాణికులను గమనిస్తే ఎంత పెద్ద ఎత్తున ఈ దందా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.
హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టైంది.హైదరాబాద్లో మనుషులను అక్రమంగా రవాణా చేసే ఈ అంతర్జాతీయ ముఠాను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు . నకిలీ వీసా, పాస్పోర్టులతో మానవ అక్రమ రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. 200 నకిలీ పాస్పోర్ట్లు, వీసాలు స్వాధీనం చేసుకున్నారు. 17 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో నకిలీ వీసాల కలకలం .. 26 మంది మహిళలు అరెస్ట్
తెలంగాణా రాష్ట్రంలో నకిలీ వీసాలకు కొదువే లేదని మొన్న శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో నకిలీ వీసాలతో పట్టుబడిన ముఠా తేల్చింది. ఇక ఎయిర్ పోర్ట్ లో అను నిత్యం ఇమ్మిగ్రేషన్ అధికారులు తనిఖీలు చేస్తున్నా నకిలీ వీసాలు మాత్రం ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొస్తూనే ఉన్నాయి. మొన్న అధికారులు పట్టుకున్న వారిలో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 26 మంది మహిళలు నకిలీ వీసాలతో అడ్డంగా బుక్కయ్యారు. దీనిపై కేసు నమోదుచేసిన పోలీసులు..ఈ నకిలీ వీసాల వెనుకున్న వారు ఎవరు..ఎక్కడ ఈ వీసాలను తయారుచేశారు అన్న కూపీలాగినట్టు తెలుస్తుంది. దీంతో సైబరాబాద్ పోలీసులు మొత్తానికి నకిలీ వీసాలతో మానవ అక్రమ రవాణాకు పాల్పడే అంతర్జాతీయ ముఠాను పట్టుకున్నారు.