తెలంగాణ రాజ్భవన్లో రోజా సందడి: గవర్నర్..మహిళా మంత్రులతో సెల్ఫీలతో..!
హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవానికి ఏపీ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యురాలు ఆర్కే రోజా హాజరయ్యారు. ఇదే కార్యక్రమానికి హాజరైన తెలంగాణ మహిళా మంత్రులతో కలిసి ఆమె సందడి చేశారు. తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్లతో సెల్ఫీ దిగుతూ కనిపించారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. వివిధ రంగాల్లో రాణించిన మహిళలకు తమిళిసై సౌందరరాజన్ అవార్డులను అందజేశారు. షటిల్ స్టార్ పీవీ సింధు, పరిశోధకురాలు జ్యోతి గౌడ, మహిళా రైతు బీ లక్ష్మమ్మ, జానపద గాయని కనకవ్వ, టాప్ గైనకాలజిస్ట్ డాక్టర్ ఎస్వీ కామేశ్వరి, గ్రామీణ విలేకరి గంగవ్వ, యోగా గురు అరుణాదేవి, క్రీడాకారిణి నికత్ జరీన్ తదితరులకు గవర్నర్ అవార్డులను అందజేశారు.
Recommended Video
తాను గవర్నర్గా పని చేసినంత కాలం ఏటేటా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తానని, గుర్తింపు పొందని మహిళా నిష్ణాతులను గౌరవించడానికే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తమిళిసై చెప్పారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారనడానికి గంగవ్వ, జ్యోతి గౌడ, లక్ష్మమ్మ నిదర్శనమని అన్నారు. ఒకరు పరిశోధకురాలిగా, మరొకరు మీడియా ప్రతినిధిగా, ఇంకొకరు రైతుగా.. ఇలా విభిన్న రంగాల్లో రాణిస్తున్నారని చెప్పారు.