లక్ష పెడితే రెండు లక్షలు.. 9 కోట్లకు ముంచారుగా..!
హైదరాబాద్ : ఫ్రీ గా వస్తోందంటే చాలు పోలోమంటూ ఫాలో అవుతారు జనాలు. ఆ ముసుగులో మోసగాళ్లు రెచ్చిపోతుంటారు. తెలిసి తెలిసి బురద గుంటలో పడేవారు చాలామందే ఉంటారు. ఇక ఉన్న డబ్బులు పోగొట్టుకుని లబోదిబమంటున్న వాళ్లకు లెక్కే లేదు. రోజుకో చోట మాయగాళ్లు బుస్సలు కొడుతూనే ఉన్నారు. వివిధ రూపాల్లో జనాల సొమ్ముకు ఎసరు పెడుతున్నారు. ఆ క్రమంలో హైదరాబాద్లో వెలుగుచూసిన తాజా ఘటన విస్తుపోయేలా చేసింది.
అధిక వడ్డీ ఆశ అనగానే ముందు వెనకా ఏమి ఆలోచించని జనాలు ఉన్నంతకాలం మోసగాళ్లు ఆటలు సాగుతూనే ఉంటాయి. మూడు మాటలు.. ఆరు మోసాలు అన్న చందంగా మాయగాళ్లు వల విసురుతూనే ఉంటారు. మోసపోయేవాళ్లు మోసపోతూనే ఉంటారు. తాజాగా హైదరాబాద్లో జరిగింది కూడా అదే. అధిక వడ్డీ ఇస్తామనగానే క్యూ లో నిల్చుని మరీ డబ్బులు సమర్పించుకున్నారు. తీరా సదరు మోసగాళ్లు కుచ్చుటోపి పెట్టేసరికి లబోదిబమంటున్నారు.
పెద్ద సారుకు చెప్పు దెబ్బ.. లైంగికంగా వేధించాడని చెంప చెళ్లు..!
అధిక వడ్డీ ఇస్తామంటూ ఆశ పెట్టి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 9 కోట్ల రూపాయలకు ఎసరు పెట్టారు మోసగాళ్లు. పాతబస్తీలోని డబీర్పురాకు చెందిన సిస్టర్ బుశ్రాతో పాటు ఆమె భర్త సిరాజ్ రహ్మాన్ UIRC అనే సొసైటీ పేరిట జనాలను నిండా ముంచారు. సొసైటీలో ఎంత డబ్బు పెట్టుబడిగా పెడితే అంతకు రెట్టింపు ఇస్తామంటూ నమ్మించారు. ఆ క్రమంలో ఒక్కో వ్యక్తి నుంచి లక్షల్లో గుంజారు.
అలా పాతబస్తీ ప్రాంతంతో పాటు మలక్పేట, సైదాబాద్, డబీర్పురా ప్రాంతాల్లో చాలామందిని మోసగించారు. అలా వసూలు చేసుకున్న తొమ్మిది కోట్ల రూపాయలతో ఉడాయించారు. విషయం కాస్తా బాధితులకు తెలిసి సదరు మోసగాళ్ల ఇంటికి వెళ్లి ఆరా తీశారు. అయితే వారి కుటుంబ సభ్యులు బాధితులపై దాడి చేయడమే గాకుండా ఉల్టా కేసులు పెడతామని బెదిరింపులకు గుర్తిచేస్తున్నట్లు బాధితులు వాపోతున్నారు. చివరకు పోలీసులను ఆశ్రయించి కేసు ఫైల్ చేశారు.