బెట్టింగ్ ఫ్యామిలీ: గోవాలో భర్త.. హైదరాబాద్లో భార్య వసూళ్లు, అల్లుడు రికార్డులు!
హైదరాబాద్: ఇప్పుడు మోసాలు, దోపిడీలు కూడా కుటుంబసమేతంగా చేసేస్తున్న ఘటనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా, ఓ దంపతులు చేస్తున్న భారీ మోసం వెలుగులోకి వచ్చింది. భర్త గోవాలో బెట్టింగ్లు నిర్వహిస్తుంటే.. భార్య మాత్రం హైదరాబాద్ నగరంలో ఉండి డబ్బు వసూళ్లు చేస్తూ అనేక మంది జేబులు గుల్ల చేస్తున్నారు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలైంది ఆ జంట.
గోవా నుంచి హైదరాబాద్లో బెట్టింగ్ దందా..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళ్హాట్కు చెందిన ధరమ్ సింగ్.. నగరంలో బెట్టింగ్ నిర్వహిస్తే పోలీసులు పట్టుకుంటారని, నెలన్నర క్రితం గోవాకు వెళ్లాడు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచులు ప్రారంభమయ్యాక అక్కడ్నుంచే బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. తన అల్లుడు రాహల్కు నెలకు రూ. 20వేలు జీతం ఇస్తానని, ఫోన్ ద్వారా బెట్టింగ్ కాసేవారి వివరాలు నమోదు చేసుకోవాలని చెప్పాడు. ఈ క్రమంలో పదిహేను సెల్ఫోన్ నెంబర్లను రాహుల్కు ఇవ్వగానే.. అతడు వారి పేర్లు రాసుకునేవాడు.
బెట్టింగ్ ఫ్యామిలీ ఆటకట్టు: భార్య, అల్లుడు అరెస్ట్
బెట్టింగ్ కాసినవారి నుంచి ధరమ్ సింగ్ భార్య సుమన్లత డబ్బులు వసూలు చేస్తుండేది. వారి చిరునామాలు తెలుసుకుని ద్విచక్ర వాహనంపై అక్కడికి వెళ్లి డబ్బు తీసుకువచ్చేది. ఈ వ్యవహారంపై టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందడంతో ఇన్స్పెక్టర్ గట్టుమల్లు బృందం మంగళవారం రాత్రి ధరమ్ సింగ్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. టీవీ, 15 ఫోన్లు, రూ. 27వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సుమన్లత, రాహుల్ సింగ్లను అరెస్ట్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Recommended Video
ఇతడు ఆటో డ్రైవర్ కమ్ చైన్ స్నాచర్..!
ఇది ఇలావుంటే, ఓ ఆటో డ్రైవర్ ఆటో నడుపుకుంటూనే చైన్ స్నాచర్గా గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్నాడు. అతడ్ని కేపీహెచ్బీకాలనీ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం బుద్దారం తండాకు చెందిన కేతావత్ శంకర్(25) నగరానికి వలస వచ్చి మియాపూర్ నడిగడ్డ తండాలో నివాసం ఉంటున్నాడు. ఇక్కడే ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. డబ్బు చాలకపోవడంతో దొంగతనాలకు అలవాటుపడ్డాడు. రోడ్డువెంట నడుచుకుంటూ వెళుతున్న మహిళలు, వృద్ధుల నుంచి గొలుసు లాక్కుని ఆటోలో పరారయ్యేవాడు. ఇలాగే అక్టోబర్ 4న కేపీహెచ్బీ కాలనీ 5వ ఫేజ్ వద్ద నడుచుకుంటూ వెళుతున్న వృద్ధురాలి నుంచి బంగారు గొలుసు లాక్కున్నాడు. దీంతో తన రూ. 2 లక్షల మంగళసూత్రాన్ని లాక్కెళ్లాడని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో తనిఖీలు చేపట్టిన పోలీసులు.. శంకర్ ఆటో నెంబర్ ప్లేటుకు థర్మాకోల్ అతికించి ఉండటంతో విచారించారు. దీంతో అసలు విషయం బయటపడింది. అతని వద్ద నుంచి 4 తులాల బంగారు గొలుసులు స్వాధీనం చేసుకున్న పోలీసులు, అతడ్ని కటకటాల్లోకి నెట్టారు.