షాకింగ్: 'జగన్ కోసం రూ.2000 కోట్ల ఫండింగ్!, ప్రతిగా కేసీఆర్ ఏం తీసుకున్నారంటే?'
హైదరాబాద్: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఎదుర్కోలేక.. వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ సహాయం తీసుకుంటున్నారా? అంటే అవుననే అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. ఏపీలో చంద్రబాబును ఓడించాలని కేసీఆర్, తెరాస నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా వైసీపీకి అనుకూలంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల తేదీలు ఓ కుట్ర అని, జగన్కు కేసీఆర్ ఆర్థిక సహకారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ఏపీ టీడీపీలో కొత్త ఉత్సాహం, జగన్ను 'కేసీఆర్' దెబ్బతీస్తున్నారా, ఇవి సంకేతాలా?
మొదటి దశలో ఎన్నికలు కుట్ర
ఏపీలో ఎన్నికలు మొదటి దశలో జరగడం ఓ కుట్ర అని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. మోడీ, జగన్, కేసీఆర్ కలిసి కుట్రపూరితంగా అసెంబ్లీ ఎన్నికలను మొదటి దశలోనే నిర్వహించేలా చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ప్రధానంగా కేసీఆర్ ఒత్తిడి చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజు ఎన్నికలు జరిగేలా చేశారన్నారు.
జగన్ కోసం కేసీఆర్ రూ.2000 ఖర్చు చేస్తున్నారా?
అంతేకాదు, జగన్కు ఫండ్స్ పరంగా కూడా కేసీఆర్ సహకరిస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. తెలంగాణ ప్రజలకు చెందిన సొమ్మును కేసీఆర్ ఏపీలో జగన్ గెలవడం కోసం ఉపయోగిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఏపీలోని తన పార్టీ అభ్యర్థుల విషయంలో జగన్.. కేసీఆర్ సలహాలు, సూచనలు తీసుకుంటున్నారని చెప్పారు. జగన్ గెలిచేందుకు కేసీఆర్ ఏపీలో రూ.2000 కోట్లు ఖర్చు పెడుతున్నారనేది నిజం కాదా అని ప్రశ్నిస్తున్నారు. జగన్కు తమను ఎదుర్కొనే ధైర్యం లేక కేసీఆర్ని ఉపయోగించుకుంటున్నారన్నారు.
ఏపీపై పెత్తనం కోసం కేసీఆర్
సువిశాల ఏపీ సముద్రతీరాన్ని, ఖనిజ సంపదను, ఏపీ ప్రజలపై పెత్తనాన్ని కేసీఆర్కు అప్పగిస్తానని చెప్పినందుకే ప్రతిగా వైసీపీకి ఇప్పటికే రూ.1000 కోట్లు ఎన్నికల కోసం పంపించడం వాస్తవం కాదా అని టీడీపీ ఏపీ నేత కళా వెంకట్రావు... కేసీఆర్కు లేఖ కూడా రాశారు. 12 కేసుల్లో ఏ1గా ఉన్న జగన్తో చేయి కలిపి కేసీఆర్ గోతిలో పడ్డారన్నారు. హైదరాబాదులోని తమ పార్టీ నేతలను బెదిరించి వైసీపీలో చేర్పించుకున్నారని ధ్వజమెత్తారు.