బాలకృష్ణపై ఐటీ ఉద్యోగుల సంఘం గుస్సా.. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు
హైదరాబాద్ : సినీ నటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు ఐటీ ఉద్యోగులు. తమపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా దివంగత నటుడు హరికృష్ణ కూతురు సుహాసిని కూకట్ పల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.ఆమెకు ప్రచారం చేయడానికి బాబాయ్ బాలకృష్ణ రంగంలోకి దిగారు. ఈక్రమంలో ఐటీ ఉద్యోగులకు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు.
ఐటీ ఉద్యోగులను కించపరిచేలా బాలకృష్ణ మాట్లాడటం సరికాదంటూ ఆ సంఘం అధ్యక్షుడు సందీప్ రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయినతర్వాతనే ఐటీ ఉద్యోగులు బాగుపడ్డట్లు ఆయన మాట్లాడిన తీరు కలచివేసిందని పేర్కొన్నారు.
ఐటీ ఉద్యోగులకు చంద్రబాబు స్పెల్లింగులు నేర్పారని చెప్పడం ఎంతవరకు కరెక్టని ప్రశ్నించారు సందీప్. చంద్రబాబుతోనే ఐటీ రంగం డెవలప్ అయిందని చెప్పడం కరెక్ట్ కాదన్నారు. ఏ ఒకరితోనో ఏ రంగమైనా అభివృద్ధి సాధించదని చెప్పుకొచ్చారు.