ఏ లెక్కన పార్టీల హామీలు..! రాష్ట్ర ఖజానా కెపాసిటీ ఎంత ? రాబడికి హామీలకు పొంతన ఉందా?
Recommended Video
ఒకరు వెయ్యంటే మరొకరు రెండువేలంటున్నారు. ఒకరు ఇది ఇస్తామంటే.. మరొకరు అది ఇస్తామంటున్నారు. ఎన్నికల వేళ పార్టీల హామీలు ఆనందంగా కనిపిస్తున్నా.. వాటి అమలు సాధ్యమయ్యేనా అన్నది కళ్లు బైర్లు కమ్మే అంశం. రాష్ట్ర రాబడి గోరంత ఉంటే.. ఖర్చు కొండంతలా ఉంటోంది. ఇప్పటికే ఉద్యోగుల జీతభత్యాలు, ప్రాజెక్టులు, పథకాల అమలుతో రాష్ట్ర ఖజానాకు చిల్లు పడుతుంటే మరోపక్క ఈ హామీల గోల మరింత "అప్పుల కుప్ప"కు కారణం కానుంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాన పార్టీలు ప్రకటించిన హామీలు చూస్తే విస్మయానికి గురికాక తప్పదు. లోతుగా విశ్లేషించి చూస్తే అసలు అవి సాధ్యమయ్యేనా అనే అనుమానాలు కలుగుతాయి. పాత పథకాల అమలుకే ఖర్చు తడిసిమోపడవుతుంటే.. ఇప్పడు కొత్తగా ఇచ్చిన హామీలు ఎలా సాధ్యమవుతాయనేది పెద్ద ప్రశ్న.
లక్షన్నర కోట్లకు పైమాటే..!
ఎన్నికల సందర్భంగా ప్రధాన పార్టీలు ప్రకటించిన మేనిఫెస్టోల అమలుకు లక్షన్నర కోట్లకు పైగానే అవసరమవుతాయనేది ఒక అంచనా. అటు టీఆర్ఎస్ గానీ, ఇటు ప్రజా కూటమిగానీ ఎవరు అధికారంలోకి వచ్చినా వారి హామీల ప్రకారం ఈ ఖర్చు భారంగా మారనుంది. దీనికితోడు ఉద్యోగుల జీతభత్యాలు, పాత పథకాల కొనసాగింపు, అప్పులు, వడ్డీలు అన్నీ కలుపుకుని లెక్కలు వేస్తే రాష్ట్ర ఖజానాపై పడే భారం రెండు లక్షల కోట్లకు పైగానే ఉండనుంది.
ఆదాయమెంత..! అప్పులెంత?
పోటీలు పడి మేనిఫెస్టోలు ప్రకటించాయి పార్టీలు. అసలు రాష్ట్రానికి వస్తున్న నికర ఆదాయం 80వేల కోట్లు. గతేడాది ప్రవేశపెట్టిన బడ్జెట్ లక్షా 70వేల కోట్లు. అంటే వచ్చేదానికన్నా పోయేది రెట్టింపుగా కనిపిస్తుంది. అదలావుంటే రాష్ట్ర ఖజానాపై అప్పుల భారం ఇప్పటికే తడిసిమోపెడవుతోంది. దాదాపు 2 లక్షల 30వేల కోట్లు అప్పుల కింద ఉన్నాయి. మన రాష్ట్ర ఆదాయమేంటో, ఖర్చేంటో ఇంత క్లియర్ కట్ గా ఉన్నప్పుడు మళ్లీ పార్టీలు ఒకరికి మించి మరొకరు కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకున్న హామీల వర్షం ఎలా కురిపిస్తారనేది చర్చానీయాంశంగా మారింది.
ఇప్పటికే అప్పుల కుప్ప.. మళ్లీ చేయి చాచడమేనా?
ఆదాయమెంతో, వ్యయమెంతో తెలిసి కూడా అధికారంలోకి రావడమే పరమావధిగా టీఆర్ఎస్, ప్రజాకూటమి ప్రకటించిన హామీలు విస్మయానికి గురిచేస్తున్నాయి. రాష్ట్ర ఖజానాపై పడే భారం ఇరు పార్టీలు ఏమాత్రం ఆలోచించలేదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ఖజానాకు భారంలా పరిణమించిన 2లక్షల 30వేల కోట్ల మాట అటుంచితే.. నికర ఆదాయం 80వేల కోట్లు మించి దాదాపు లక్షన్నర కోట్ల (రెట్టింపు) మేర హామీలు గుప్పించడమేంటనే వాదనలు వినిపిస్తున్నాయి. అధికారంలోకి వచ్చి ఈ హామీలు తీర్చాలంటే మళ్లీ అప్పుల కోసం చేయి చాచడమేనా? అసలు మేనిఫెస్టోలు ప్రకటించేముందు రాష్ట్ర ఆదాయాన్ని ఏమాత్రం పట్టించుకున్నట్లు లేదనే ఆరోపణలు చక్కర్లు కొడుతున్నాయి.