టీఆర్ఎస్ కు ఐటీ ఫస్ట్ ఝలక్ !? భారీగా పెరిగిన ఆస్తులు పై సీఎం కేసీఆర్ సహా ఎమ్మెల్యేలకు ఐటీ నోటీసులు ?
హైదరాబాద్ : గులాబీ నేతలకు ఐటీ షాక్ తగిలింది. మొన్నటి ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే టార్గెట్ గా కొరడా ఝలిపించింది. ఎన్నికల సంఘానికి, ఆదాయపు పన్ను శాఖకు సమర్పించిన పత్రాల్లో భారీ వ్యత్యాసాలు ఉండటమే దీనంతటికీ కారణంగా తెలుస్తోంది. ఆ పద్దుల నిగ్గు తేల్చే దిశగా నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. 2014 నాటి ఎన్నికలతో పాటు 2018 ముందస్తు ఎన్నికల అఫిడవిట్లు, ఈ ఐదేళ్ల ఐటీ రిటర్న్స్ సమర్పించాలని స్పష్టం చేసిందట ఐటీ శాఖ.
72 స్థానాలు, 961 మంది అభ్యర్థులు.. బరిలో హేమాహేమీలు.. రేపే నాలుగో విడత పోలింగ్
బాస్ సహా అందరికి నోటీసులు?
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై నజర్ పెట్టింది ఐటీ డిపార్టుమెంట్. సీఎం కేసీఆర్ సహా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. 2018, డిసెంబర్ లో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరైతే టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచారో, వారందరికీ తాఖీదులు పంపినట్లు సమాచారం.
2014 ఎన్నికలతో పాటు 2018 ఎలక్షన్లలో సమర్పించిన అఫిడవిట్లు.. అలాగే అప్పటినుంచి ఇప్పటివరకు అంటే గడచిన ఐదేళ్లల్లో సమర్పించిన ఐటీ రిటర్న్స్ కూడా దాఖలు చేయాలని కోరిందట. ఊహించని పరిణామంతో గులాబీ నేతలకు గుబులు పట్టుకుందట. దాంతో ఆడిటర్ల దగ్గరకు పరుగులు పెడుతున్నారనే టాక్ వినిపిస్తోంది.
పింక్ ఎమ్మెల్యేలే టార్గెట్?
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే టార్గెట్ గా ఐటీ నోటీసులు జారీ కావడం విస్మయం కలిగిస్తోంది. ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు ఎవరికి కూడా ఐటీ నోటీసులు జారీ కాలేదని తెలుస్తోంది. అయితే గులాబీ గూటి ఎమ్మెల్యేలు మరోసారి ఆస్తులు, అప్పులు లెక్కలేసుకుంటున్నట్లు సమాచారం. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లతో ఐటీ రిటర్న్స్ బేరీజు వేసుకుంటున్నారట. అదలావుంటే భారీ వ్యత్యాసాలు పేర్కొన్న ఎమ్మెల్యేలు మాత్రం ఐటీ నోటీసులతో తలలు పట్టుకుంటున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి.
2014 అఫిడవిట్.. 2018 అఫిడవిట్.. మధ్యలో ఐటీ రిటర్న్స్
2014 అసెంబ్లీ ఎన్నికల తర్వాత అంటే 2015-16, 2016-17, 2017-18, 2018-19 ఆర్థిక సంవత్సరాలకు గాను దాఖలు చేసిన ఐటీ రిటర్న్స్ లో కొందరు ఎమ్మెల్యేలు ఆస్తులు ఎక్కువ చూపినట్లు తెలుస్తోంది. అయితే 2018 ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ లో మాత్రం సదరు ఆస్తుల వివరాలు పొందుపరచలేదని ఐటీ అధికారులు గుర్తించినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీ రిటర్న్స్ లో ఎక్కువ ఆస్తులు చూపి.. 2018 ముందస్తు ఎన్నికల నాటికి ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ లో తక్కువ చూపించారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే ఐటీ శాఖ కన్నుపెట్టిందనే వాదనలు లేకపోలేదు.
మరి మిగతా 4 రాష్ట్రాల పరిస్థితేంటి?
గులాబీ ఎమ్మెల్యేలకు ఐటీ నోటీసులు అనే అంశం తెలుగు రాష్ట్రాల్లో చర్చానీయాంశంగా మారింది. ఇటీవల దేశవ్యాప్తంగా ఐటీ అధికారులు కొరడా ఝలిపిస్తున్నప్పటికీ.. తెలంగాణలో కేవలం టీఆర్ఎస్ ఎమ్మెల్యేల వరకే నోటీసులు పంపడమనేది హాట్ టాపికయింది. అయితే కేంద్ర ప్రభుత్వ జోక్యంతో ఈ నోటీసులు వచ్చాయా.. లేదంటే అధికార యంత్రాంగం తన పని తాను చేసుకుపోతుందా అనే చర్చ జోరందుకుంది. అదలావుంటే డిసెంబర్ లో తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. మరి ఆ రాష్ట్రాలపై కూడా ఐటీ అధికారులు నజర్ పెట్టారా.. ఓన్లీ తెలంగాణలో మాత్రమే దాడులకు సిద్ధమయ్యారా అనేది కొందరు లెవనెత్తిన ప్రశ్న.