పారిశ్రామికవేత్త మై హోమ్ రామేశ్వర్రావు కార్యాలయం నివాసంలో ఐటీ దాడులు..?
ప్రముఖ పారిశ్రామికవేత్త మైహోం గ్రూప్ అధినేత రామేశ్వర్ రావుపై ఐటీ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. గురువారం ఉదయం నుంచి ఈ దాడులు జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం తెలంగాణలోని పారిశ్రామికవేత్తల్లో ప్రథమ స్థానంలో రామేశ్వర్ రావు ఉన్నారు. పలు రాజకీయ పార్టీలతో కూడా ఆయనకు మంచి సంబంధాలున్నాయి. ఈ మధ్యే రామేశ్వర్రావు మీడియా రంగంలోకి కూడా ప్రవేశించారు. పలు కంపెనీలకు అధినేతగా ఉన్న రామేశ్వర్రావుపై ఆదాయపు పన్ను శాఖ దృష్టి సారించింది.
గురువారం ఉదయం హైటెక్ సిటీలోని రామేశ్వర్ రావు కార్యాలయం, హైదరాబాద్లోని నందగిరి హిల్స్లో ఉన్న ఆయన నివాసంపై దాదాపు 100 మంది ఐటీ అధికారులు ఏకకాలంలో దాడులు చేసినట్లు సమాచారం. దాదాపు రూ. 3వేల కోట్లు వివిధ మార్గాల ద్వారా రాజకీయ పార్టీలకు బదిలీ చేసినట్లు ఐటీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. అంతేకాదు రామేశ్వర్రావుతో పాటు మరో పారిశ్రామికవేత్త శ్రీనిరాజులకు 100 ఎకరాల ప్రభుత్వం భూమి 20శాతం ధరకే కేటాయించడంపై కూడా ఐటీ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.