ఆ సర్పంచ్కి కేటీఆర్ సలాం.. లాక్ డౌన్ పొడగింపుపై కీలక వ్యాఖ్యలు..
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా గ్రామాల్లో,నియోజకవర్గాల్లో ప్రజా ప్రతినిధులంతా కథానాయకుల్లా కదలాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలాచోట్ల ప్రజాప్రతినిధులు రోడ్ల పైకి వచ్చి ఇష్టారీతిన తిరుగుతున్నవారిని నియంత్రిస్తున్నారు. అలాగే కొన్నిచోట్ల వారే స్వయంగా క్రిమి సంహారక మందులు స్ప్రే చేస్తున్నారు. తాజాగా మహబూబాబాద్ జిల్లా నరసింహులుపేట్ మండలం గోపతండా సర్పంచ్ అజ్మీరా లక్ష్మీ నాయక్ కరోనా వైరస్ సోకకుండా పారిశుద్ధ్య కార్మికులతో కలిసి గ్రామంలో క్రిమిసంహారక మందులు చల్లుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. మంత్రి కేటీఆర్ ఆమె ఫోటోను #సిటిజెన్హీరోస్ ట్యాగ్తో ట్విట్టర్లో షేర్ చేసి ఈ విషయాన్ని వెల్లడించారు.
ఇక ఆర్థిక ప్రగతి కంటే ప్రజల ప్రాణాలకే తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని మరో ప్రకటనలో కేటీఆర్ వెల్లడించారు. కరోనా వ్యాప్తి ఆగిపోయిన తర్వాతే లాక్ డౌన్ ఎత్తివేయాలని అభిప్రాయపడ్డారు. తొందరపాటు నిర్ణయాలతో ఇప్పుడు పొరపాటు చేస్తే భవిష్యత్ తరాలకు తీరని నష్టం జరుగుతుందన్నారు. సోషల్ డిస్టెన్స్ పాటించడం,లాక్ డౌన్ మాత్రమే కరోనా కట్టడికి మార్గమని చెప్పారు. కరోనా వైరస్ను అభివృద్ది చెందిన దేశాలు సైతం ఎదుర్కోలేకపోతున్నాయని అన్నారు. 130కోట్ల జనాభా ఉన్న దేశంలో అందరికీ వైద్య పరీక్షలు ఆచరణ సాధ్యం కాదన్నారు. విచ్చలవిడిగా పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం కూడా అనుమతివ్వదన్నారు.
ఇప్పటివరకు కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్దంగా ఉందని మంత్రి అన్నారు. అవసరమైన మెడికల్ సామాగ్రిని ఇప్పటికే సమకూర్చుకున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో లాక్ డౌన్ కారణంగా ఏ ఒక్కరూ ఆకలితో అలమటించవద్దన్న లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. జూన్ మొదటి వారం నాటికి దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి తీవ్రమయ్యే అవకాశం ఉందని పలు సంస్థల రిపోర్ట్స్ చెబుతున్నాయని అన్నారు. కాబట్టి లాక్ డౌన్ పొడగించడమే సరైందన్నారు.
My #CitizenHeroes today is a young sarpanch from Gopathanda in Narsimhulupet Mandal of Mahbubabad district
— KTR (@KTRTRS) April 7, 2020
Her name is Azmeera Lakshmi and she leads from the front in the battle against Covid19 by spraying of disinfectants in her entire village along with sanitation workers 👏 pic.twitter.com/Ecz6hWf9q0